మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా టెక్స్టైల్స్ మిల్లులో ఆదివారం రోజు తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు సహా ఓ చిన్నారి కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను దిగ్ర్భాంతికి గురి చేసిన ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు.. 100 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు. మొత్తంగా 17 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.
మే 18వ తేదీ ఆదివారం రోజు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (MIDC) ప్రాంతంలోని ఓ టెక్స్టైల్స్ మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే మిల్లులో రెండు కుటుంబాలు ఉడంగా.. వారంతా అక్కడే పడుకున్నారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడే ప్రమాదం జర్గగా.. అందులోనూ అక్కడన్నీ వస్త్రాలే ఉండగా.. క్షణాల్లోనే మంటలు ఉవ్వెతున ఎగిసి బిల్డింగ్ మొత్తాన్ని తాకాయి. ఫలితంగా రెండు కుటుంబాలకు చెందిన మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే విషయం గుర్తించిన స్థానికుల పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇలా వారంతా హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.
మొత్తంగా 100 ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 17 గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకు వచ్చారు. అలాగే మృతులను, క్షతగాత్రులను బయటకు తీసుకు వచ్చేందుకు విపరీతంగా ప్రయత్నించారు. ఈ సమయంలోనే ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. అయితే చనిపోయిన వారిలో 80 ఏళ్ల ఫ్యాక్టరీ యజమాని హాజీ ఉస్మాన్ హసన్ భాయ్ మన్సూరి, అతడి మనవడు 25 ఏళ్ల అనాస్ హనీఫ్ మన్సూరి, మనవడి భార్య 20 ఏళ్ల షిఫా అనాస్ మన్సూరి, వీరి ఏడాదిన్నర కుమారుడు యూసుఫ్ మన్సూరి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే వీరంతా ఓ బెడ్రూంలో ఉండగా.. వీరి మృతదేహాలను బయటకు తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది గోడను కూల్చివేశారు. యూసుఫ్ తన తల్లి చేతుల్లో కనిపించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మరో నలుగురు మృతుల్లో 45 ఏళ్ల మెహతాబ్ సయ్యద్ బాగ్వాన్, అతడి భార్య 38 ఏళ్ల ఆశాబాను, వారి కుమారుడు 20 ఏళ్ల సల్మాన్, కుమార్తె 26 ఏళ్ల హీనా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరందరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాలతో చనిపోగా.. మరో ఐదుగురు మాత్రం మంటలు చుట్టుముట్టి పొగ ఎక్కువకాగా.. దాన్ని పీల్చి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa