ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌‌తో సైనిక ఘర్షణల్లో పాక్‌కు చైనా సైనిక సాయం చేసిందా? డ్రాగన్ సమాధానం

international |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 08:44 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాక్‌కు సైనిక సహాయం చేసిందా? అనే ప్రచారంపై డ్రాగన్ స్పందించింది.. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి చైనా ప్రయత్నిస్తోందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నామని, ప్రాంతీయ సుస్థిరత కోసం తాము పాటుపడతామని చెప్పారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్‌' చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసి ధ్వంసం చేసింది. ఇదే సమయంలో పాక్‌కు చైనా ఇచ్చిన గగనతల రక్షణ వ్యవస్థలను జామ్ చేసినట్టు భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల సమయంలో తాము తటస్థంగా వ్యవహరించామని మావోనింగ్ చెప్పారు. ‘‘భారత్, పాక్ సంయమనం పాటించాలని చైనా పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి మద్దతు ఇచ్చాం. శాశ్వత కాల్పుల విరమణను ప్రోత్సహించడంలో, ప్రాంతీయ సుస్థిరత కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం’ అని ఆమె అన్నారు. అంతేకాదు, ‘పౌరులు, పౌర మౌలికవసతులను లక్ష్యంగా చేసుకుని జరిగే దాడులను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. ఖండిస్తుంది.. వారి భద్రతను నిర్ధారించుకోవాలని అన్ని పార్టీలకు పిలుపునిస్తుంది’ అని పేర్కొన్నారు. మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన గంటల్లోనే ఉల్లంఘనకు పాక్ పాల్పడిన కొద్దిసేపటికే చైనా ఆ దేశానికి మద్దతు ప్రకటించడం గమనార్హం.


ఈ క్రమంలో సూడాన్ కాల్పుల విరమణ అంశం ప్రస్తావించారు. ‘సూడాన్ సమస్యపై చైనా ఒక లక్ష్యం.. న్యాయమైన వైఖరిని అనుసరిస్తుంది.. సూడాన్‌లో కాల్పుల విరమణ త్వరగా అమలులోకి వచ్చి రాజకీయ ప్రక్రియ ముందుకు సాగుతుందని, శాంతి, స్థిరత్వం, అభివృద్ధి త్వరగా తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.


అయితే, చైనా తమకు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు సమకూర్చిందని పాకిస్థాన్ విర్రవీగింది. కానీ, ఆపరేషన్ సిందూర్‌లో భారత క్షిపణులను అవి అడ్డుకోలేకపోయాయి. చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వ్యవస్థలు, వాటి రాడార్లు కూడా విఫలమయ్యాయి. భారత క్షిపణులు తక్కువ ఎత్తులో, వేగంగా దూసుకెళ్లడంతో పాక్ రాడార్లు వాటిని గుర్తించలేకపోయాయని భావిస్తున్నారు. అయితే, భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చైనా అసహనం వ్యక్తం చేసింది.


ఈ ఆపరేషన్‌ను జీర్ణించుకోలేకపోయిన దాయాది.. చైనాకు చెందిన పీఎల్‌-15, టర్కీకి చెందిన YIHA, సొంగార్ డ్రోన్లతో భారత వైమానిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ, అది విఫలమైంది. ఈ ఉద్రిక్తతల సమయంలో చైనా, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ సంయమనంతో ఉందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ అన్నట్లు వార్తలు వచ్చాయి. ‘సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో ఆ దేశానికి అండగా నిలుస్తాం’ అని వాంగ్ యీ పేర్కొన్నారు. ఈ సమయంలోనే చైనా సహాయం గురించి ఆరోపణలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa