పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన భూపరిపాలనలో సంస్కరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టిజె భరత్ పాల్గొన్నారు. ఫ్రీ హోల్డ్ భూములు, 22ఎ నుండి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదాబైనామాలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది.పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఫ్రీ హోల్డ్ భూములను 10 కేటగిరీలుగా విభజించగా 8 కేటగిరీలకు మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 3 లక్షల ఎకరాల భూములు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తన అనుయాయులకు ఫ్రీ హోల్డ్ చేసిందని అన్నారు. ఈ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఒకవేళ చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీ హోల్డ్ చేసినప్పటికీ వాటిని తిరిగి లాక్కోవడం ఉండదని భరోసా ఇచ్చారు. అటువంటి పేదలకు మళ్లీ ఆ భూములను అసైన్ చేస్తామని పేర్కొన్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాతనే ఆ భూములు ఫ్రీ హోల్డ్ చేయబడతాయన్నారు. 22ఎ నుండి భూముల తొలగింపుకు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కలెక్టర్లు పని చేస్తున్నారా లేదా అనేది మంత్రి వర్గ ఉపసంఘం చర్చించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa