దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మిశ్రమంగా కదలాడాయి. స్పాట్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగితే, వెండి మాత్రం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. ఏకంగా కిలో వెండి ధర రూ.2 లక్షల కీలక మైలురాయిని దాటింది. అయితే, ఫ్యూచర్స్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.157 పెరిగి రూ.1,32,474 వద్ద స్థిరపడింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,346కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం కిలోపై రూ.1,479 పెరిగి రూ.2,01,120 పలికింది. దీంతో దేశీయ మార్కెట్లో వెండి సరికొత్త రికార్డును నమోదు చేసింది.దీనికి విరుద్ధంగా, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ధరలు తగ్గాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 0.50 శాతం క్షీణించి రూ.1,34,218కి చేరగా, మార్చి సిల్వర్ కాంట్రాక్ట్ 1.19 శాతం తగ్గి రూ.2,04,961 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 0.34 శాతం తగ్గి 4,357 డాలర్ల వద్ద, వెండి ధర ఒక శాతం తగ్గి 66.24 డాలర్ల వద్ద కదలాడింది.ఇటీవలి భారీ ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు తగ్గాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పసిడి, వెండి ధరలు స్థిరీకరణ దశలో ఉన్నాయని, రాబోయే ప్రపంచ ఆర్థిక డేటా ఆధారంగా తదుపరి మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa