మహారాష్ట్ర రాజకీయాల్లో అవినీతి, కుంభకోణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ ఫ్లాట్ పొందేందుకు నకిలీ పత్రాలు సమర్పించిన కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి మాణిక్రావ్ కోకాటేకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి చేసిన రాజీనామాను ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గురువారం ఆమోదించారు. దీంతో అవినీతి ఆరోపణలతో పదవులు కోల్పోయిన మంత్రుల జాబితాలో కోకాటే పేరు కూడా చేరింది.గత ఏడాది ప్రభుత్వం కోకాటేను రక్షిస్తోందంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఒత్తిడి పెరగడంతో కోకాటే పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. మహారాష్ట్ర చరిత్రలో ఇలా మంత్రులు రాజీనామా చేయడం కొత్తేమీ కాదు. సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపణలపై ఏర్పాటైన జస్టిస్ పీబీ సావంత్ కమిషన్ నివేదిక ఆధారంగా గతంలో సురేష్ జైన్, పదంసింహ్ పాటిల్, నవాబ్ మాలిక్ వంటి మంత్రులు పదవులు వీడాల్సి వచ్చింది.రాష్ట్ర చరిత్రలో కుంభకోణాల కారణంగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా తమ కుర్చీలను కోల్పోయారు. సిమెంట్ కుంభకోణంలో ఎ.ఆర్. అంతులే, కుమార్తె మెడికల్ మార్కుల వివాదంలో శివాజీరావ్ నీలంగేకర్-పాటిల్, ఆదర్శ్ హౌసింగ్ స్కామ్లో అశోక్ చవాన్ రాజీనామా చేశారు. ఇదే జాబితాలో ఉప ముఖ్యమంత్రులు రాంరావ్ ఆడిక్, ఛగన్ భుజ్బల్ కూడా ఉన్నారు.అవినీతి ఆరోపణలతో పదవులు కోల్పోయిన కేబినెట్ మంత్రుల జాబితా చాలా పెద్దది. వీరిలో అనిల్ దేశ్ముఖ్, సురేష్ జైన్, నవాబ్ మాలిక్, సంజయ్ రాథోడ్ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరిలో కొందరు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆసక్తికరంగా హోం మంత్రి పదవిని నిర్వహించిన ఛగన్ భుజ్బల్, పదంసింహ్ పాటిల్, అనిల్ దేశ్ముఖ్.. ముగ్గురూ ఆర్థిక అవకతవకల నుంచి హత్య కేసుల వరకు వివిధ ఆరోపణలతో అరెస్ట్ కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa