ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 05:25 PM

ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు. నేటి నుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తామన్నారు. జూన్ 21న ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షలమందితో కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్ సైట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. యోగా అనేది మన దేశానికి వారసత్వంగా వస్తోంది. భారతీయ జీవన విధానంలో ఒక భాగం. దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది ప్రధాని మోదీయే. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దేశంలో చదువుకునేవారు. రానురాను విదేశీ దాడులతో అంతా కనుమరుగైంది. మళ్లీ ఇప్పుడు యోగా విలువ ప్రపంచానికి తెలిసేలా ప్రధాని మోదీ చేశారు. 2014 డిసెంబర్ లో యునైటెడ్ నేషనన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచంమంతా యోగా దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యోగా అనేది ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినది కాదు. మనిషి జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది యోగా. నేటి ఆధునిక యుగంలో అందరూ పరుగులు పెడుతున్నారు. టెక్నాలజీతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి దానికీ టెన్షన్ పడుతున్నారు. లైఫ్ మెకానికల్ గా మారుతోంది. వీటన్నంటిని నుంచి ఉపశమనం రావాలంటే యోగా ఒక్కటే మార్గం. రికార్డు సృష్టించేలా నేటి నుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తాం. ఫోటోల కోసమో, ఈవెంట్ల కోసమే చేసే కార్యక్రమం కాదు. నెల మొత్తం పలు కార్యక్రమాలు నిర్వహించి యోగాపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించాం. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తాం. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమందికి తగ్గకుండా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 10 లక్షలమందితో యోగా కోర్సులు చేయించి వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయాలని నిర్ణయించాం. సముద్రం పక్కన ఇలాంటి యోగా నిర్వహించడం అరుదైన విషయం. సముద్ర తీరాన, ప్రకృతి ఒడిలో జరిగే ఈ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.జూన్ 21న యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నందున మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుంది. పలు యూనివర్సిటీలు, పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లోని వాలంటీర్లు, మహిళలు, వృద్ధులు, పోలీసులు, ఉద్యోగులు యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి. అలాంటివారికి ధ్రువపత్రాలు కూడా అందజేస్తాం. పట్టణాలు, నగరాల నుంచి గ్రామస్థాయి వరకూ యోగాభ్యాసన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాని మోదీ ప్రపంచమంతా యోగాను ప్రమోట్ చేస్తున్నప్పుడు మనకూ బాధ్యత ఉంటుంది కదా. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా కూడా చొరవ తీసుకుని యోగాను ప్రమోట్ చేయాలి. మంచి కంటెంట్ తో ఆర్టికల్స్ రాయాలి. మంచి వీడియోస్ తయారుచేయాలి. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో అసోసియేట్ చేసుకుని 2 వేలమంది యోగా శిక్షకులను తయారుచేస్తాం. యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్ లో పెడతాం.అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యం. మన సమస్యలకు చక్కటి పరిష్కారం యోగా. అందరూ రోజూ ఒక గంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్ చేయాలి. వీటిని ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి మాయమై పనిని ఎంజాయ్ చేస్తారు. యోగా కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, పతంజలి, బ్రహ్మ కుమారీస్ ఇలాంటి అసోసియేషపోలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. వీరితో నేను ఎన్నో ఏళ్లుగా అసోసియేట్ అవుతున్నారు. అప్పట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు వాసుదేవ్ తో ఐఏఎస్ , ఐపీఎస్, మంత్రులకు నేను క్లాసులు పెట్టించాను. బ్రహ్మకుమారీస్ ప్రపంచమంతా యూనిట్లు పెట్టారు... అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa