తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మే 22న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏటా వైశాఖ మాసం బహుళదశమి రోజున తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 22వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం హనుమజ్జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనుంది. వేడుకల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న బేడి ఆంజనేయస్వామికి, కాలినడకబాటలోని ఏడవ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. సాంప్రదాయం ప్రకారం టీటీడీ తరపున జపాలి హనుమాన్కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
హనుమజ్జయంతి సందర్భంగా మొదటి ఘాట్రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి మే 22వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యం కోసం టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది. తిరుమల నుంచి ఏడో మైలుకు, అలాగే తిరిగి తిరుమల చేరడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తోంది. అలాగే హనుమజ్జయంతి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం రోజున 76,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,766 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.07 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారుగా 18 గంటలు పట్టినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు తిరుమలలో వైఖాసన ఆగమ సలహా కమిటీ నియామకం పూరైంది. మార్చి నెలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేశారు. అలాగే కొత్త కమిటీని నియమించారు. తాజాగా ఐదుగురు సభ్యులతో కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీ ఏర్పాటైంది.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు కృష్ణ శేషాచలం దీక్షితులుతో పాటుగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన పీ.కే.వరదన్ భట్టాచార్యార్, గోవిందరాజ స్వామి దేవాలయం సంభావన అర్చకులు ఏ.అనంతశయన దీక్షితులు, మాజీ అర్చకులు ఏ.ఖద్రీ నరసింహాచార్యులు సభ్యులుగా నూతన ఆగమ సలహా కమిటీ నియామకం జరిగింది. ఈ ఆగమ సలహా కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa