ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఓ లారీ డ్రైవర్కు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నారు. 2024 ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో.. ఓ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ట్యాక్స్ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్ తమిళనాడులో రూ.200, తెలంగాణలో రూ.500గా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూ. 6 వేలు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్ వాపోయారు. దీంతో తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్ద వాపోతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక లారీ డ్రైవర్కు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని చేర్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. లారీలు, ట్రక్కుల వంటి రవాణా వాహనదారులకు ఊరట కలిగిస్తూ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయంతో ప్రస్తుతం ఏడాదికి గరిష్టంగా రూ.20 వేల వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు.. ఇకపై కేవలం రూ.1,500 నుంచి రూ.3 వేలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు కాలంచెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ పెంచే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది. దీంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచింది. ఏడేళ్లు దాటిన వాహనాలకు ఏడాదికి రూ.200లుగా ఉన్న గ్రీన్ ట్యాక్స్ను.. పలు స్లాబ్లుగా మార్చింది. దీంతో గ్రీన్ ట్యాక్స్ రూ.4 వేల నుంచి రూ.6000 వరకూ చెల్లించాల్సి వచ్చింది. 2022 జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో సరకు రవాణా వాహనదారులపై తీవ్ర భారం పడింది. ఏడాదికి గరిష్ఠంగా రూ.20 వేలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో లారీల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ లారీ డ్రైవర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వద్ద కూడా లారీ సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించి తమను ఆదుకోవాలని ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ను కలిసి అభ్యర్థించారు. దీంతో తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రీన్ ట్యాక్స్ తగ్గించి మరో హామీని అమలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై లారీ యజమానులు, సరుకు రవాణా వాహనాదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa