ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థియేటర్ల బంద్‌పై మంత్రి కందుల దుర్గేశ్ విచారణకు ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 06:34 AM

జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు ఇటీవల తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నారో తేల్చాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ పరిణామం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.థియేటర్ల బంద్‌కు సంబంధించి ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి కందుల దుర్గేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను ఆదేశించినట్లు జనసేన పార్టీ తన 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించింది. ముఖ్యంగా, 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించేందుకే కొందరు  థియేటర్ల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసికట్టుగా ఒక బృందంగా ఏర్పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు. ఈ బంద్ కారణంగా ఎన్ని సినిమాలు నష్టపోతాయి, ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయానికి ఎంతవరకు గండి పడుతుంది అనే కోణంలో కూడా వివరాలు సేకరించాలని ఆదేశించినట్లు సమాచారం.కొన్ని రోజుల క్రితం, తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించడం వల్ల తమకు సరైన ఆదాయం రావడం లేదని, మల్టీప్లెక్స్‌ల తరహాలోనే వసూళ్లలో వాటా  విధానాన్ని అమలు చేయాలని సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లలో వాటాల పద్ధతి అమలవుతుండగా, తాము మాత్రం అద్దె పద్ధతిలోనే ఎందుకు కొనసాగాలన్నది వారి ప్రధాన వాదన.ఈ సమస్య పరిష్కారానికి నిర్మాతలు ఇప్పటికే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒక విడత చర్చలు జరిపారు. తదుపరి చర్చల కోసం శనివారం మరోసారి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం థియేటర్ల బంద్‌పై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ జోక్యంతో ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa