ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పతాగి పోలీస్ జీపుతో ర్యాష్ డ్రైవింగ్.. తిరుమల కొండపై కానిస్టేబుళ్ల రచ్చరచ్చ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:37 PM

మద్యం తాగి వాహనాలు నడుపుతున్నవారిని గుర్తించి పట్టుకోవాల్సిన పోలీసులే.. ఫుల్లుగా తాగి పోలీసు జీపులో బయలుదేరారు. అదే మత్తులో అడ్డువచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ తిరుమల చేరుకున్నారు. అక్కడ బూతుపురాణం అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమల కొండపై నానా రచ్చా చేశారు. తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు బి.రాజశేఖర్, కె. ఓంకార్‌ నాయక్, షేక్‌ సిరాజుద్దీన్‌.. తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మతులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతి తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. పోలీసు వాహనం కావడంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. ముగ్గురూ వాహనాన్ని అతివేగంగా నడిపి... మత్తులో ఘాట్‌ రోడ్డులో ఓ వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం తిరుమల చేరుకుని రింగురోడ్డు మీదుగా డీ టైప్‌ క్వార్టర్స్‌ వద్ద వేగంగా వస్తూ డ్రైనేజీ కల్వర్టును ఢీకొన్నారు. దీంతో ముందు టైరు పేలిపోయింది. కారులో నుంచి దిగిన ముగ్గురిలో షేక్‌ సిరాజుద్దీన్‌ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. రాజశేఖర్, ఓంకార్‌ నాయక్‌లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఓంకార్‌ నాయక్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, సిరాజుద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తూ కమాండెంట్‌ దీపికా పాటిల్‌ ఉత్తర్వులు జారీచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa