ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్త కరోనా వేరియంట్లు.. లక్షణాలు ఇవే, కేంద్రం అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:41 PM

కరోనా వైరస్‌ను పూర్తిగా అంతం అయిందని.. ఇప్పుడిప్పుడే ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఆ మహమ్మారి మరోసారి తన ఉనికిని చాటుకుంటోంది. ఇటీవల ఆసియా దేశాలైన హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, చైనాల్లో ఒక్కసారిగా కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతుండటం.. అది కాస్తా భారత్‌లోనూ కనిపించడం ఇప్పుడు కొత్త భయాలను కలిగిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే కొత్తగా కొవిడ్ కేసులు వెలుగు చూస్తుండటంతో రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆస్పత్రులను అప్రమత్తం చేసి.. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి.


కొత్త వేరియంట్లు, కేసుల వివరాలు


ఇండియన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1.. ఎల్‌ఎఫ్‌.7లను గుర్తించారని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో వెలుగుచూడగా.. ఎల్‌ఎఫ్‌.7కు సంబంధించిన 4 కేసులు ఈ నెలలోనే తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఇక గత మూడేళ్లలో తొలిసారిగా ఢిల్లీలో 23 మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యతను చూసుకోవాలని సూచించింది.


మరోవైపు.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయినప్పటికీ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.


అంతర్జాతీయ వ్యాప్తి, లక్షణాలు


ఇటీవలి కాలంలో ఆసియా దేశాలు.. ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ సహా చైనాలోనూ కొవిడ్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ వైరస్ వ్యాప్తికి జేఎన్‌ 1 వేరియంట్‌, దాని సబ్ వేరియంట్‌లే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్‌ 1 సబ్ వేరియంట్లు అయిన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు.


ఇక జేఎన్‌ 1 రకం వేరియంట్‌ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ మాత్రమేనని.. ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. అయితే ఇది ఆందోళన కలిగించే రకం కాదని.. ఇదివరకే స్పష్టం చేసింది. అయితే వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు, ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గడం కూడా ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa