ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మోస్ క్షిపణులతో ,,,పాక్‌ఫైటర్ జెట్లు, ఒక ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసం

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 07:43 PM

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. అయితే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించడం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఈ ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చావు దెబ్బ తగిలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, సైన్యం, సైనిక విమానాలు, ఫైటర్ జెట్లు సహా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు జరిపిన దాడుల్లో 170 మందికిపైగా ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది. ఇక పాక్ చేసిన దాడులను అడ్డుకునేందుకు భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను 11సార్లు యాక్టివేట్ అయినట్లు తెలిసింది. భారత వైమానిక దళం రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ విమానాలను ఉపయోగించి స్కాల్ప్, బ్రహ్మోస్ మిసైల్స్‌తో పాకిస్తాన్ భూభాగంలోకి 315 కిలోమీటర్ల లోపలికి దూసుకెళ్లి.. ఒక ఎస్ఏఏబీ-2000 ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు అనేక యుద్ధ విమానాలను, ఒక సైనిక రవాణా విమానాన్ని ధ్వంసం చేసినట్లు తెలిసింది.


అదే సమయంలో లాహోర్, కరాచీ నగరాల్లోని చైనా సరఫరా చేసిన ఎల్‌వై-80, హెచ్‌క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరడంతో మే 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగడంతో ఉద్రిక్తతలు తగ్గాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక సీ-130జే మీడియం లిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఒక జేఎఫ్-17 ఫైటర్ జెట్, 2 F-16 జెట్లు ధ్వంసం అయ్యాయి.


భారత్ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ తమ ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్‌తో ప్రతిస్పందించేందుకు ప్రయత్నించింది. మే 10వ తేదీన తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రారంభమై.. తదుపరి 48 గంటల్లో ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని.. దాడులు చేయగా.. అది కేవలం 8 గంటల్లోనే ముగిసింది. రఫేల్, సుఖోయ్-30ఎంకేఐ విమానాల నుంచి.. స్కాల్ప్, బ్రహ్మోస్ క్షిపణులతో భారత వైమానిక దాడులు పాకిస్తాన్ కార్యకలాపాలను దెబ్బతీశాయి. దీంతో ఉదయం 9:30 గంటలకల్లా కాల్పుల విరమణ కోరుతూ అమెరికాను పాకిస్తాన్‌ ఆశ్రయించింది.


ఆపరేషన్ సమయంలో ఆదంపూర్‌లో మోహరించిన భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను 11 సార్లు యాక్టివేట్ చేశారు. పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లో వందల కిలోమీటర్ల లోపల ప్రయాణిస్తున్న పాకిస్తాన్ సాబ్-2000 ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎస్-400 కూల్చివేసింది. మొదట ఐఏఎఫ్ దాడి చేసి.. చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్‌బైస్ వద్ద ఉత్తర వైమానిక కమాండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌ను నిలిపేసింది. చివర్లో జకోబాబాద్, భోలారి ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది.


మే 10వ తేదీన భారత క్షిపణులు లాహోర్‌లో ఒక హార్పీ కమికాజే డ్రోన్‌ను ఉపయోగించి చైనా సరఫరా చేసిన ఎల్‌వై-80 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా ధ్వంసం చేశాయి. మరో దాడి కరాచీలోని మలిర్‌లో హెచ్‌క్యూ-9 ఉపరితల గగనతల వ్యవస్థను (S-300 చైనీస్ వెర్షన్) నాశనం చేసింది. అయితే మే 10వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌కు ముందు మే 7వ తేదీన భారత వైమానిక దళాలు 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. మురిద్కే, బహావల్‌పూర్‌లోని కీలక లక్ష్యాలను స్కాల్ప్, బ్రహ్మోస్ క్షిపణులతో కచ్చితత్వంతో ఛేదించారు. మే 10వ తేదీన ఉదయం ఇండియన్ నేవీ.. కరాచీ నావల్ పోర్ట్‌పై దాడి చేయడానికి సిద్ధంగా ఉండగా.. యుద్ధ నౌకలు మక్రన్ తీరం నుంచి 260 మైళ్ల దూరంలో మోహరించారు. కానీ ఆ రోజు తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa