ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియాలో ఐఫోన్లు తయారైతే 25 శాతం సుంకాలు.. బెదిరిస్తున్న ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 11:28 PM

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల‌్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో విక్రయించేటువంటి ఐఫోన్‌లు కచ్చితంగా అక్కడే తయారు కావాలని, లేకపోతే యాపిల్ ఉత్పత్తులపై కనీసం 25 శాతం టారిఫ్ (పన్ను) విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్త శుక్రవారం రోజు.. టెక్ ప్రపంచంలో, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' లో చేసిన పోస్ట్‌లో, "యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు నేను చాలా కాలం క్రితమే తెలియజేశాను, యునైటెడ్ స్టేట్స్‌లో విక్రయించే వారి ఐఫోన్‌లు భారతదేశంలోనో లేదా మరెక్కడో కాకుండా, యునైటెడ్ స్టేట్స్‌లోనే తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అలా జరగకపోతే, యాపిల్ కనీసం 25 శాతం టారిఫ్ అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది.'' అని స్పష్టం చేశారు.


ట్రంప్ ఈ ప్రకటన చేయగానే, US ఈక్విటీ ఫ్యూచర్స్ పడిపోయాయి. నాస్‌డాక్ 100 కాంట్రాక్టులు భారీగా క్షీణించాయి. యాపిల్ షేర్లు 4 శాతం పడిపోయాయి. అమెరికాకు ఎక్కువ తయారీ ఉద్యోగాలను తీసుకురావాలని కంపెనీలను ఒత్తిడి చేసే ట్రంప్ ప్రయత్నాలలో యాపిల్ తరచుగా లక్ష్యంగా మారుతోంది. యాపిల్ తన ఐఫోన్‌లను ఎక్కువగా చైనాలో తయారు చేస్తుంది. అమెరికాలో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి అస్సలు లేదు. అయితే, రాబోయే నాలుగు సంవత్సరాలలో దేశీయంగా బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి, అమెరికాలో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటామని యాపిల్ హామీ ఇచ్చింది.


ఈ నెల ప్రారంభంలో కూడా ట్రంప్.. యాపిల్‌పై ఒత్తిడి పెంచారు. చైనా నుంచి తమ ప్రొడక్ట్స్ తయారీని.. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ తయారీని భారతదేశానికి మారుస్తుండటాన్ని తాను ఇష్టపడటం లేదని, టిమ్ కుక్‌ను భారతదేశంలో ప్లాంట్లు నిర్మించడాన్ని ఆపివేయాలని, బదులుగా అమెరికాపై దృష్టి పెట్టాలని కోరినట్లు ట్రంప్ పేర్కొన్నారు. గత వారం తన పశ్చిమాసియా పర్యటన సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.


టారిఫ్‌ల ప్రభావం


ట్రంప్ విధించాలనుకుంటున్న 25 శాతం టారిఫ్స్ అమల్లోకి వస్తే, ఐఫోన్‌ల ధరలు భారీగా పెరుగుతాయి. ఇది యాపిల్ అమ్మకాలకు, అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన యాపిల్ లాభాలకు తీవ్రంగా నష్టం కలిగించొచ్చు. ట్రంప్ విధించిన దిగుమతి పన్నుల వల్ల ఏర్పడిన అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిడికి ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తున్న అమెజాన్, వాల్‌మార్ట్, ఇతర ప్రధాన కంపెనీల జాబితాలో ఇప్పుడు యాపిల్ కూడా చేరింది.


యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో.. సప్లై చెయిన్‌ దెబ్బతినకుండా.. ఐఫోన్ తయారీని భారతదేశానికి మార్చాలని చూస్తున్నారు. ట్రంప్‌‌నకు ఈ విషయం అస్సలు మింగుడుపడటం లేదు. అందుకే.. ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోనే తయారీ ఉండాలని బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com