ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి చెన్నై నగరానికి విచ్చేశారు. 'వన్ నేషన్వన్ ఎలక్షన్' ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై సోమవారం ఉదయం చెన్నైలో జరగనున్న ఒక కీలక సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.అంతకుముందు, ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన నేరుగా చెన్నైకి బయలుదేరి వెళ్లారు.చెన్నై విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఆత్మీయ స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, పర్యావరణవేత్త కె.ఎస్. రాధాకృష్ణన్, తమిళనాడు బీజేపీ నాయకులు ఎం. చక్రవర్తి, అర్జున మూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా విమానాశ్రయానికి వచ్చి పవన్ కల్యాణ్ కు ఘనంగా స్వాగతం తెలియజేశారు.పవన్ రాక వార్త తెలుసుకున్న జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ, జయజయధ్వానాలు చేస్తూ తమ నేతకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం, పవన్ కల్యాణ్ హోటల్ వద్దకు చేరుకోగా, అక్కడ కూడా ఆయనకు స్వాగత ఏర్పాట్లు కొనసాగాయి. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పలువురు ఇతర బీజేపీ నాయకులు హోటల్ వద్ద పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. సోమవారం జరగనున్న సెమినార్లో 'ఒకే దేశం ఒకే ఎన్నిక' విధానంపై పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa