ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సిందూర్‌‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతలకు మోదీ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 06:47 PM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యం.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో అసందర్భమైన వ్యాఖ్యలు చేసిన తన పార్టీ నాయకులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టిగా క్లాస్ పీకి, వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని మోదీ ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రతి విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని సూచించినట్టు వర్గాలు వెల్లడించాయి.


పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్‌పై కొంతమంది బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీ అపోహల్లో పడినట్లు అనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా, ఆపరేషన్ సిందూర్‌ సమయంలో మీడియా సమావేశాల్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అనుచిత, మతపరమైన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి చేరగా.. న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.


బీజేపీ నేత, మంత్రి విజయ్ షా.. ఓ బహిరంగ సభలో కల్నల్ ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’గా వ్యాఖ్యానించడమే కాకుండా.. ‘పాకిస్థాన్‌లోని ఉండే సముదాయానికి చెందిన మహిళను ఆ దేశంపై పంపించాం’ అని నోరుజారారు. ‘మా అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచేసిన మీకు.. మీ మతానికి చెందిన సోదరే మీకు అవమానం చేస్తుంది. మీ సమాజంలోని కుమార్తెలను పాకిస్థాన్‌పైకి పంపి ప్రతీకారం తీర్చుకోవచ్చిన మోదీ జీ నిరూపించారు’ అని షా వ్యాఖ్యానించారు.


అలాగే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చంద్ర జాంగ్రా, పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం మరో వివాదంగా మారింది. ‘వారి దగ్గర వీరత్వం, ధైర్యం లేదు కాబట్టే వారు ఉగ్రవాదులకు బలయ్యారు’ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.


హర్యానాలోని భివానీలో జరిగిన మహారాణి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవంలో మాట్లాడిన ఆయన.. ‘ భర్తలను కోల్పోయిన ఆ మహిళల్లో వీరత్వం, యోధుల స్ఫూర్తి లేదు. వేడుకొనే బదులు.. ఉగ్రవాదులపై తిరగబడి పోరాడాల్సింది. అందుకే వారు తమ భర్తలను కోల్పోవాల్సి వచ్చింది’ జాంగ్రా చేసిన వ్యాఖ్యలతో అక్కడివారు అవాక్కయ్యారు.


తర్వాత మీడియా ‘ఒక మహిళ ఉగ్రవాదులతో ఎలా పోరాడగలదు?’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అహిల్యాబాయి హోల్కర్ ఒక మహిళే, రాణి లక్ష్మీబాయ్ కూడా అలాగే. వాళ్లు పోరాడలేదా? మన అక్కచెల్లెళ్లూ ధైర్యంగా జీవించాలి అనుకుంటున్నాం’ అని అన్నారు. నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఎవరూ హద్దులు దాటి మాట్లాడొద్దని సూచించారని సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa