టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ అనే అంశం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనిప్రశ్నించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణ న్యాయం చేసేందుకు, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
''హరి హర వీరమల్లు మూవీ విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ విషయం ఎందుకు తెరపైకి వచ్చింది. ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు వెంటనే స్పందించి నిర్ణయాన్ని తెలియజేయాల్సింది కదా. ఏడాదిగా ఏపీ ప్రభుత్వం ఏనాడైనా మీ సినిమాలకు ఇబ్బంది కలిగించిందా? సినీ నిర్మాతలు విడివిడిగా వచ్చి అడిగినా, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాం. సమష్టిగా రండి. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించుకుందాం. అల్లు అరవింద్ వ్యాఖ్యలు సహేతుకంగా ఉన్నాయి. ప్రస్తుతానికి థియేటర్ల బంద్ లేదన్నారు కాబట్టి సమస్య సమసిపోయినట్లే. భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కార్యాచరణ అవసరం'' అని కందుల దుర్గేష్ అన్నారు.
సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు మంత్రి దుర్గేష్. సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని తద్వారా అధికారులు కోర్టులు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొందని, టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందన్నారు. ఈ విధానాలన్నింటికి చెక్ పెట్టి నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాలను తీసుకురావాలని భావించామన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే తాము రేట్ల పెంపుకు అనుమతిస్తున్నామని, తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని కొందరు అహంభావంతో మాట్లాడుతున్నారని, ఇది సరైన విధానం కాదని సూచించారు.
సినిమా రంగం వ్యాపారమని కొందరు మాట్లాడుతున్నట్లుగా సినిమా రంగానికి ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు గత ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. నిర్ణయాలు ఎందుకు చేశారని నిలదీశారు. తహసిల్దార్ లను థియేటర్ల దగ్గర పెట్టి రేట్లను ఎందుకు నియంత్రించారు అని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ఇక మీదటైనా అందరూ కలిసికట్టుగా, సరైన రీతిలో వ్యవహరించాలన్నారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది సహేతుకంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa