ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పథకాలన్నీ ఆపేసి అప్పులు, అరాచకాలు చేస్తున్నారని రోజా మండిపాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 08:35 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు మేలు చేసే పథకాలను నిలిపివేశారని, రాష్ట్రంలో అప్పులు, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా చేతులెత్తేశారని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడును ఉద్దేశించి కూడా రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని మహానాడులో ఒక తీర్మానం చేయగలరా అంటూ ఆమె సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చినట్లు ప్రజలతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. ఈ విషయంపై చర్చించేందుకు మంగళగిరి, కుప్పం, పిఠాపురం, హిందూపురం ఇలా ఎక్కడికి రమ్మన్నా తాను వస్తానని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చింది అక్రమాలు, అప్పులు, అరాచకాలు చేయడానికేనని మాజీ మంత్రి రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa