ఈపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే వడ్డీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ నిల్వలపై 8.25 శాతం వడ్డీని ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే, ఈ వడ్డీ సొమ్ము ఖాతాల్లో జమ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో చందాదారుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వడ్డీ జమ ఆలస్యం కావడం వల్ల ఏదైనా నష్టం వాటిల్లుతుందా అని కొందరు ఆందోళన చెందుతున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుమారు మూడు నెలల పరిశీలన అనంతరం, మే 24న కేంద్రం ఈ సిఫార్సును ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే, ఈ వడ్డీ సొమ్ము ఎప్పటిలోగా ఖాతాల్లో జమ అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిపుణుల అంచనా ప్రకారం, దీనికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వడ్డీ జమ ఆగస్టు-సెప్టెంబర్ నెలల మధ్య జరిగింది. ఈసారి అంత జాప్యం జరగకపోయినా, మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి రెండు నెలలు దాటినా ఇంకా వడ్డీ జమ కాకపోవడంపై కొందరు ఖాతాదారులు సామాజిక మాధ్యమాల వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ యుగంలో కూడా వడ్డీ జమకు ఇంత సమయం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వడ్డీ జమ ఆలస్యం కావడం వల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని కోల్పోతామేమోనని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.అయితే, ఇలాంటి ఆందోళనలు అవసరం లేదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేస్తోంది. ఈపీఎఫ్ఓ స్కీమ్ 1952లోని పేరాగ్రాఫ్ 60 ప్రకారం, పీఎఫ్ వడ్డీని ప్రతినెలా రన్నింగ్ బ్యాలెన్స్పై లెక్కిస్తారు. ఇలా లెక్కించిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తారు.ఉదాహరణకు, మీరు బ్యాంకులో లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం. సంవత్సరానికి 10 శాతం వడ్డీ అయితే, ఏడాది చివర్లో రూ.10,000 వడ్డీ మీ అసలుకు కలుస్తుంది. అక్కడ వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు.కానీ, ఈపీఎఫ్ విషయంలో అలా కాదు. ప్రతినెలా వడ్డీని లెక్కించి, ఆర్థిక సంవత్సరం చివర్లో జమ చేస్తారు. ఉదాహరణకు, మీ ఖాతాలో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.1,00,000 ఉందని, ప్రతినెలా ఉద్యోగి వాటా, యాజమాన్య వాటా కలిపి రూ.3,500 జమ అవుతోందని అనుకుందాం. అప్పుడు మొదటి నెల క్లోజింగ్ బ్యాలెన్స్ రూ.1,03,500 అవుతుంది. వార్షిక వడ్డీ రేటు 8.25 శాతం కాబట్టి, నెలవారీ వడ్డీ రూ. 687.50 అవుతుంది. ఇలా ప్రతినెలా క్లోజింగ్ బ్యాలెన్స్పై వడ్డీని లెక్కించి, సంవత్సరం చివర్లో అసలుకు కలుపుతారు. కాబట్టి, వడ్డీ జమ ఆలస్యమైనంత మాత్రాన ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కోల్పోవడం జరగదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa