ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారంలో మాజీ భార్య ఐశ్వర్య రాయ్ సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 08:59 PM

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ చుట్టూ అలుముకున్న తాజా వివాదంపై ఆయన మాజీ భార్య ఐశ్వర్య రాయ్ తీవ్రంగా స్పందించారు. తేజ్ ప్రతాప్ ఒక ఫేస్‌బుక్ పోస్టులో తన పన్నెండేళ్ల ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి, కొద్ది నిమిషాలకే దాన్ని తొలగించడం, ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్.. తేజ్ ప్రతాప్‌ను కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెలివేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలపై ఐశ్వర్య రాయ్ మౌనం వీడి, లాలూ కుటుంబంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తేజ్ ప్రతాప్, ఐశ్వర్య రాయ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అసలు విషయం ముందే తెలిసినప్పుడు, నాతో ఎందుకు పెళ్లి జరిపించారు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు?" అంటూ ఐశ్వర్య రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడిని పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించడాన్ని ఆమె ఒక 'నాటకం'గా అభివర్ణించారు. రాబోయే బీహార్ ఎన్నికల నేపథ్యంలో, పార్టీకి జరగబోయే నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ డ్రామా సృష్టించారని ఆరోపించారు.తేజ్ ప్రతాప్ యాదవ్ శనివారం నాడు, తాను గత 12 సంవత్సరాలుగా ఒకరితో సంబంధంలో ఉన్నానని వెల్లడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే, ఆయన 2018లో బీహార్‌కు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి మనవరాలైన ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. ఆదివారం నాడు లాలూ ప్రసాద్ యాదవ్, తేజ్ ప్రతాప్ వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించినందుకు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన తమ కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేదని లాలూ 'ఎక్స్' వేదికగా తెలిపారు.లాలూ చర్యలపై స్పందిస్తూ ఐశ్వర్య, "ఇప్పుడు వారికి అకస్మాత్తుగా సామాజిక స్పృహ కలిగింది. వాళ్లంతా కలిసే ఉన్నారు. వాళ్లేమీ విడిపోలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అందుకే ఇలాంటి చర్య తీసుకుని ఈ నాటకం సృష్టించారు. నా విడాకుల గురించి నాకు మీడియా ద్వారానే తెలిసింది. నాకు తెలిసిన సమాచారం అంతా మీడియా ద్వారానే. ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వాళ్లని అడగండి నన్ను కొట్టినప్పుడు వారి సామాజిక న్యాయం ఎక్కడికి పోయింది? నా సంగతేంటి అని వారిని అడగండి?" అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు."ప్రతిదానికీ నాపైనే నిందలు వేశారు. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. అతనికి 12 ఏళ్లుగా అఫైర్ ఉంది. మహిళను నిందించడం చాలా సులభం. నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? నా పోరాటాన్ని కొనసాగిస్తాను" అని ఐశ్వర్య స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa