తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగ సందర్భంగా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో జరుగుతున్న ఈ తొలి మహానాడు ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ ఖాతా ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు. "ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం టీడీపీ కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి" అని కార్యకర్తల ఉత్సాహాన్ని, యువత ప్రాముఖ్యతను కొనియాడారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడం తెలుగుదేశం పార్టీ పవిత్ర కర్తవ్యమని నొక్కి చెప్పారు. "ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం" అని చంద్రబాబు తెలిపారు.గతంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అనేక పరీక్షలను విజయవంతంగా అధిగమించిందని గుర్తుచేస్తూ "తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచింది. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ మహానాడు సందర్భంగా కొన్ని ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. "ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యమివ్వాలని, అన్నదాతకు అండగా నిలవాలని కోరుతున్నా. ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని ఆకాంక్షిస్తున్నా" అని తన సందేశంలో వివరించారు.పార్టీలో కార్యకర్తల పాత్రను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో "‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి. అదే నా ఆశ.. ఆకాంక్ష" అని చంద్రబాబు నాయుడు తన మనోగతాన్ని స్పష్టం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa