ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,,, చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 06:53 PM

కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహానాడు వేదికగా మహిళలకు సూపర్ న్యూస్ వినిపించారు. ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని 2024 ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.


ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకం హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కూడా ఏపీ ప్రభుత్వం పరిశీలించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించింది. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరులో పర్యటించి.. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి క్షేత్రస్థాయిలో అక్కడ పథకం అమలవుతున్న తీరును తెలుసుకుంది. అనంతరం కర్ణాటక రవాణాశాఖ అధికారులతో పథకం తీరుతెన్నులపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు.


అనంతరం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ వద్ద ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి.. ఇంకా బస్సులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏమేరకు ఉంది.. అలాగే సిబ్బందిని పెంచుకోవాలా వంటి వివరాలపై కసరత్తు జరిపింది. ఈ అంశాలన్నింటిపైనా కసరత్తు జరిపిన అనంతరం.. ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన చేశారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా అమలు చేయనుంది. అలాగే ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa