కడప నగరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు బహిరంగ సభలో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల నాయకత్వాన్ని కొనియాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, "కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని చంద్రబాబు గారు నిరూపించారు. రాబోయే ఐదేళ్ల గురించి ఆలోచించే వారిని పొలిటికల్ లీడర్ అంటారని, కానీ 20 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవాడిని విజనరీ లీడర్ అంటారని, ఆ విజనరీకి నిలువెత్తు రూపం చంద్రబాబు గారు" అని కొనియాడారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన 2047 నాటికి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఆశయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, యువతకు ఉపాధి అవకాశాలు కొరవడ్డాయని ఆరోపించారు. నారా లోకేశ్ 'యువగళం' యాత్ర ద్వారా పార్టీకి పునరుత్తేజం తెచ్చి, కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రకృతి కూడా సహకరించి మహానాడు విజయవంతమైందని, ఇది 'దేవుడి స్క్రిప్ట్' అని ఆమె వ్యాఖ్యానించారు. నిన్న మహానాడులో లోకేశ్ గారు చేసిన ఆరు తీర్మానాలు 2047 అభివృద్ధికి పునాదులు కాబోతున్నాయని, వాటిని గ్రామగ్రామాన తెలియజేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa