ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం డ్యామ్‌కు పెద్ద ముప్పుగా మారిన గుంత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 03:48 PM

తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం డ్యామ్‌‌కు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలోనే పలు నిపుణుల బృందాలు, ప్యానళ్లు, కమిటీలు డ్యామ్‌ను పరిశీలించాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కిందపడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడి.. అది అంతకంతకూ పెరిగి పునాదులు బయటపడే వరకు వెళ్లింది అంటున్నారు. నేషనల్ ‌డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) శ్రీశైలం డ్యామ్ దుస్థితిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. అసలు శ్రీశైలం డ్యామ్ ఎందుకు ప్రమాదంలో చిక్కుకుంది?.. ఎలా ఆ సమస్యను ఎలా పరిస్కరించాలనే చర్చ జరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ప్లంజ్‌పూల్‌ గుంత పెద్దది కావడం వల్ల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.


డ్యామ్ దగ్గర నీరు భూమిని కోసుకుంటూ వెళ్లడంతో.. డ్యామ్ అడుగు భాగానికి కూడా ఆ గుంత వ్యాపిస్తుందని.. దాని వల్ల డ్యామ్ పునాదులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది. శ్రీశైలం డ్యామ్ స్పిల్‌వే నుంచి గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలిన సమయంలో.. ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు నేలపై పడితే గుంతలా ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కూడా అదే జరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచన సమయంలో నీళ్లు పడిన చోట భూమిపై గుంత ఏర్పడి ప్రాజెక్ట్ పునాదుల వరకు వెళుతోంది.. దానిని ప్లంజ్ పూల్ అంటారు. అలా నీళ్లు పడటంతో రివర్ బెడ్‌ను కోసేస్తోంది.. ఆ క్రమంలో గుంత పెద్దదిగగా మరుతుంది. అక్కడ గుంత చాలా లోతు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


వాస్తవానికి 1980లోనే ఈ సమస్య ఉందని గుర్తించారు.. దాని కోసం యాప్రాన్‌ను రక్షణగా నిర్మించారు. అలాగే ఇబ్బందులు రాకుండా స్టీల్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో ఎత్తు నుంచి నీళ్లు కిందపడినా భూమి కొట్టుకుపోకుండా ఉంటుంది. కానీ 2009లో వరదలతో ఆ స్టీల్ సిలిండర్లు కూడా కొన్ని కొట్టుకుపోగా.. మరికొన్ని ధ్వంసం అయ్యాయి. ఆ గుంతను సెట్ చేయడానికి, అక్కడ మళ్లీ స్టీల్ సిలిండర్లు పెట్టడానికి, ఆ ప్లంజ్ పూల్ విస్తరించకుండా తక్షణ ఏర్పాట్లు చేయడానికి.. ఎడమ, కుడి వైపుల నది ప్రవాహం ఎక్కువగా వచ్చిన సమయంలో కొండచరియలు విరిగిపడకుండా, కోతకు గురికాకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గతంలో రిపేర్లకు రెండున్న కోట్లు అడిగితే రూ.40 లక్షలే ఇచ్చారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది. ప్లంజ్ పూల్ పూర్తిస్థాయిలో రీడిజైన్ చేయాలన్నారు. మోడ్రన్ జియో టెక్నికల్ ఎక్విప్‌మెంట్ ఉండాలని సూచించారు.. ఈ ఎక్విప్‌మెంట్ ఉంటే డ్యామ్‌కు ఇబ్బందులుంటే పసిగట్టి అలర్ట్ చేస్తుంది అంటున్నారు.


గతంలోనే ఈ ప్లంజ్‌పూల్‌ గుంత వల్ల శ్రీశైలం డ్యామ్‌‌కు ఇబ్బంది ఉందని నిపుణుల బృందాలు హెచ్చరించాయి. అయితే ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అధ్యయనం కోసం రూ.14 కోట్లు మంజూరు చేసింది అంటున్నారు. ప్రాజెక్టులోని ప్లంజ్‌పూల్‌ సమస్యపై అధ్యయనం చేయడానికి సీడబ్ల్యూపీఆర్‌సీకి అనుమతి ఇవ్వాలని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అలాగే ఇటీవల దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో చర్చించారు. తెలంగాణ అధికారులు వెంటనే అధ్యయనం చేయించాలని కోరారు.. ఏపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డు సూచించింది. ప్రాజెక్టు ఇంజనీర్లు చంద్రబాబు ప్లంజ్‌పూల్‌ సమస్య, మరమ్మతుల గురించి వివరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేఆర్‌ఎంబీ సూచించింది. అయితే ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులుపడలేదు అంటున్నారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa