తిరుమలలో వేసవి సెలవుల కారణంగా భక్తులు పోటెత్తారు.. కొండపై రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న కంపార్ట్మెంట్లతో పాటుగానారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, వెలుపల క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో భక్తులకు అవసరమైన ఆహారం, తాగునీరు అందిస్తోంది.. శ్రీవారి సేవకులు భక్తులకు అంందజేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆల్వార్ ట్యాంక్ దగ్గరున్న సర్వదర్శనం క్యూ లైన్లో ఓ భక్తుడు నినాదాలు చేసిన ఘటన కలకలంరేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. 'దర్శన క్యూలైన్లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన భక్తుడు అనంతరం క్షమాపణ చెప్పారు. టీటీడీకి వ్యతిరేకంగా దర్శన క్యూలైన్ లో నినాదాలు.. దర్శనాంతరం టీటీడీకి క్షమాపణ.. నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతో ఇలా చేశానంటూ తప్పు ఒప్పుకున్న భక్తుడు అచ్చారావు' అంటూ భక్తుడు మాట్లాడిన వీడియోను కూడా ట్వీట్ చేశారు.
మరోవైపు ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ఈ ఘటనపై స్పందించింది.. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. 'తిరుమలలో భక్తులు నానా అవస్థలు పడుతున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి స్వామివారి భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... క్యూలైన్ లో పాలు , నీళ్లు లేవు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే వేసవి సెలవుల కారణంగా తిరుమలలో గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేసింది' అని ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.
'అయితే రాత్రి 10:30 గంటల సమయంలో సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న కాకినాడ రూరల్, తిమ్మాపురం ప్రాంతానికి చెందిన బి అచ్చారావు అనే భక్తుడు "టీటీడీ యాజమాన్యం డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేసాడు...క్యూలైన్ లో పాలు , నీళ్లు లేవు అంటూ నిరసన చేశాడు....వాస్తవానికి దర్శన క్యూలైన్ల వద్ద ప్రతి వంద అడుగులకు శ్రీవారి సేవకులచే భక్తులకు నిర్విరామంగా మంచినీరు, పాలు, అన్న ప్రసాదాలను టీటీడీ పంపిణీ చేస్తోంది. సదరు భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన తర్వాత ఎందుకలా చేసారని అడిగితే... తనకు ఆరోగ్యం బాగాలేదని... ఇలా నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతి ఇస్తారనే ఉద్దేశంతో అలా చేసానని... చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. అయితే ఎవరో అక్కడనున్న ప్రజలను రెచ్చకొట్టి ఉద్దేశపూర్వకంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి చేసే ఇటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. భక్తులు, ప్రజలు ఎవరూ ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. భక్తుల రద్దీకి తగినట్టుగా అన్ని సౌకర్యాలను టీటీడీ కల్పించింది' అంటూ క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa