ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిక్కిం వరదల్లో చిక్కుకున్న ఏపీ ఎమ్మార్వో కుటుంబం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 09:04 PM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మార్వో కుటుంబం కూడా వరదల్లో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో వరదలు సంభవించింది. ఈ వరదల్లో విజయనగరం తహసీల్దార్‌ కుటుంబం చిక్కుకుపోయింది. విజయనగరం తహశీల్దారు కూర్మనాథ్ రావు వేసవి సెలవులు కావటంతో కుటుంబంతో సిక్కిం వెళ్లారు. ఐదు రోజుల క్రితం ఫ్యామిలీని తీసుకుని గ్యాంగ్‌టక్ వెళ్లారు. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల దూరంలోని టూరిస్ట్ స్పాట్ చూడ్డానికి వెళ్లింది తహశీల్దార్ కుటుంబం.


అయితే నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిక్కిం రాష్ట్రంలో గత రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయనగరం ఎమ్మార్వో కుటుంబం వెళ్లిన మార్గం వరద నీటితో మూసుకుపోయింది. ఈ కారణంగా విజయనగరం తహశీల్దారు కూర్మనాథ్ కుటుంబం అక్కడే హోటల్‌లో ఉండిపోయింది. తాము బస చేసిన హోటల్‌లోనే వీరంతా సురక్షితంగా ఉన్నారు. వరద నీటి ప్రవాహం తగ్గి.. రూట్ క్లియర్ అయిన తర్వాత కూర్మనాథ్ కుటుంబం గ్యాంగ్‌టక్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సిక్కిం వరదల్లో విజయనగరం ఎమ్మార్వో కుటుంబం చిక్కుకుపోవటంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు.


విజయనగరం తహశీల్దారు కూర్మనాథ్ కుటుంబాన్ని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సిక్కిం డీజీపీ, ఇతర అధికారులతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. అటు ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీకాంత్ సైతం సిక్కిం రాష్ట్ర అధికారులతో ఈ విషయమై సంప్రదింపులు జరిపారు. దీంతో విజయనగరం తహశీల్దారు కుటుంబం కోసం సహాయక చర్యలు చేపట్టామని.. వారంతా హోటల్‌లో సురక్షితంగా ఉన్నట్లు సిక్కిం డీజీపీ తెలిపారు.


మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అలాగే కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. వరదల కారణంగా సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1,500 మంది వరకూ పర్యాటకులు చిక్కుకున్నట్లు తెలిసింది. అటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa