ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో అరుదైన ఘటన.. రికార్డు స్థాయి దర్శనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 11:23 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుణ్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. ఇక వేసవి సెలవుల్లో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కొత్త రికార్డు నమోదైంది. దాదాపు పదేళ్ల తర్వాత మే 31న తిరుమల శ్రీవారిని అత్యధిక మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 95,080 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. గత పదేళ్ల కాలంలో ఒక్క రోజు ఇంతమంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం ఇదే తొలిసారిగా పేర్కొంది. మే 16 నుంచి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేశారని.. అహర్నిశలు విధులు నిర్వహించారని టీటీడీ అభినందించింది. గత రెండు వారాల్లో గురు, శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించినట్లు తెలిపింది. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం.. వివిధ విభాగాల అధిపతుల పర్యవేక్షణలో సిబ్బంది పనిచేసినట్లు వివరించింది. విజిలెన్స్ విభాగం, టీటీడీ ఆలయ సిబ్బంది పరస్పర సహకారంతో అన్నప్రసాదం, తాగునీరు, పాలు భక్తులకు అందించినట్లు టీటీడీ ప్రకటనలో వెల్లడించింది.


మరోవైపు గతేడాది మే నెలతో పోల్చితే, ఈసారి 55,759 మంది భక్తులకు అధికంగా దర్శనం కల్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 2024 మే నెలలో 23,23,493 మంది భక్తులుదర్శించుకోగా, 2025 మేలో 23,79,252 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.అలాగే, అన్నప్రసాద వితరణలోనూ ఈ ఏడాది నూతన రికార్డు నమోదైనట్లు టీటీడీ తెలిపింది. 2024 మేలో 71 లక్షల అన్న వితరణలు జరిగితే, ఈ ఏడాది మేలో 1.33 కోట్ల వితరణలు నమోదైనట్లు తెలిపింది. తలనీలాల సంఖ్య, లడ్డూ విక్రయాలు కూడా గత ఏడాది మేతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో అధికంగా నమోదైనట్లు టీటీడీ తెలిపింది.


మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. గోవిందరాజస్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన సోమవారం ఉదయం ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa