రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అంతకుముందు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. అయితే ఈ విధానంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణల మధ్య ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించి, ఆ మేరకు అమలు చేస్తోంది. ఆదివారం నుంచి ఈ విధానం అమల్లోకి రాగా.. తొలి రోజే రాష్ట్రంలోని 18 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే రేషన్ కార్డుదారులకు ఉపయోగకరంగా ఉండేలా మరో నిర్ణయం తీసుకుంది.
ప్రతి రేషన్ షాపు వద్ద పూర్తి వివరాలతో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డులో సదరు రేషన్ దుకాణానికి సంబంధించిన రేషన్ డీలర్, అధికారుల వివరాలు ఉంటాయి. అలాగే ఈ బోర్డులో ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ కార్డుదారులకు ఏమైనా సమస్యలు వస్తే.. తమ సెల్ఫోన్లో స్కాన్ చేసి ఆ అంశం మీద అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇక లబ్ధికారుల ఫిర్యాదు మీద 24 గంటల్లోనే అధికారులు స్పందిస్తారని ప్రభుత్వం చెప్తోంది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు.
మరోవైపు ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. తొలిరోజు 18.87 లక్షల కుటుంబాలు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకున్నాయి. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని 29,760 రేషన్ దుకాణాల ద్వారా ఉదయం 8 నుంచి రేషన్ పంపిణీ మొదలైంది. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ సరుకులు అందిస్తారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారంతో సహా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
మినీ మాల్స్గా రేషన్ షాపులు
మరోవైపు రేషన్ దుకాణాలను అభివృద్ధి చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తెలిపారు. ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ సరుకుల పంపిణీని నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రేషన్ షాపులను అభివృద్ధి చేస్తామని.. భవిష్యత్తులో మినీ మాల్స్గా డెవలప్ చేస్తామని వెల్లడించారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అలాగే మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల వద్ద ఏఐతో పనిచేసే కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు రాష్ట్రంలో 15.60 లక్షల మంది ఉన్నారన్న నాదెండ్ల మనోహర్.. వీరికి ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు వీరిందరికీ ఇంటి వద్దే రేషన్ సరకులు అందిస్తామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa