ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తూ ఉండటంతో రైల్వే లైన్ పనులు, ఆర్వోబీల నిర్మాణాల్లోనూ వేగంపుంజుకుంది. ఈ క్రమంలోనేఏపీలో కొత్త ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. తిరుపతివాసుల దశాబ్దం నాటి కలను సాకారం చేస్తూ తిరుపతిలో కొత్త ఆర్వోబీ అందుబాటులోకి వచ్చింది. తిరుపతి బైపాస్ రోడ్డులోని కేఎల్ఎమ్ ఆస్పత్రి సమీపంలో కొత్త ఆర్వోబీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
తిరుపతి - చెన్నై జాతీయ రహదారి NH -205 రహదారి విస్తరణ పనులను 2010లో చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చంద్రగిరి సమీపంలోని కాలూరు క్రాస్ నుంచి పుత్తూరు మరాఠీ గేటు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. రూ.600 కోట్లతో ఈ విస్తరణ పనులు చేపట్టగా.. కొన్ని చోట్ల పనులు పూర్తి చేయలేదు. ముఖ్యంగా తిరుపతి - చెన్నై జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తిరుపతిలోని కేఎల్ఎం ఆసుపత్రి వద్ద ఆర్వోబీ నిర్మించాలని ప్రతిపాదించగా.. ఆ పనులను కాంట్రాక్టు కంపెనీ పూర్తి చేయలేదు.
అలాగే పలుచోట్ల పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పెండింగ్ పనులను పూర్తి చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. దీంతో 2023 జూన్లో రూ.120 కోట్లు ఈ పెండింగ్ పనుల కోసం మంజూరయ్యాయి. దీంతో అధికారులు మళ్లీ టెండర్లు పిలిచి.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు.
మరోవైపు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పెండింగ్ నిర్మాణ పనులను రెండేళ్ల కిందట ప్రారంభించారు. 2023 జూన్లో పనులు ప్రారంభం కాగా.. నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే 2024 దసరా నాటికి కేఎల్ఎం ఆసుపత్రి సమీపంలో ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రైల్వే అనుమతులు ఆలస్యంతో పనుల్లో జాప్యం జరిగింది. చివరకు రైల్వే అధికారుల నుంచి అనుమతులు తీసుకుని వంతెన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తి కావటంతో పూతలపట్టు - నాయుడుపేట, తిరుపతి-చెన్నై జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి.
ఆర్వోబీ నిర్మాణం పూర్తికాక ముందు ఒకే మార్గం ఉండటంతో ఉదయం వేళ, సాయంత్రం పూట వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. ప్రస్తుతం ఆర్వోబీ పూర్తి కావడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే చెన్నై నుంచి తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు కూడా ట్రాఫిక్ సమస్యలు తప్పనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa