ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం..ట్రంప్కు షాకివ్వనున్న భారత్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 08:33 PM

అమెరికా టారిఫ్‌లు, ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా సుంకాలు, ప్రతీకార సుంకాలతో భారత్, చైనా సహా అనేక దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తంఅవుతోంది. ఈ క్రంమలోనే భారత స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాలను పెంచడాన్ని భారత్ తీవ్రంగా నిరసిన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రతీకార సుంకాలు విధించాలని నిర్ణయించుకుంది. జూన్ 4వ తేదీ నుంచి స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా తన సుంకాలను 50 శాతానికి పెంచుతుందని ప్రకటించడంతో..ప్రపంచ వాణిజ్యం సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కి నోటీసులు పంపించింది. అయితే ఆ నోటీసులను తిరస్కరించిన అమెరికా.. తమ సుంకాలు జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది. ఈ నిర్ణయంతో లక్షలాది డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుండటంతో.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.


అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు భారత్ ఇటీవల డబ్ల్యూటీఓకు తేల్చిచెప్పింది. దీని గురించి డబ్ల్యూటీఓ ద్వారా అమెరికాకు నోటీసులు పంపించగా.. వాటిని ట్రంప్ సర్కార్ తిరస్కరించింది. తమ సుంకాలు భద్రతా చర్యలు కావని.. జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉక్కు, అల్యూమినియంలపై మొదట 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. జూన్ 4వ తేదీ నుంచి వాటిని 50 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో భారత్ డబ్ల్యూటీఓను ఆశ్రయించింది.


అమెరికా వ్యవహరిస్తున్న తీరుతో దామాషా ప్రకారం ఆ దేశ దిగుమతులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత్ నిర్ణయించింది. దీంతో అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. భారత్-అమెరికా మధ్య అతి త్వరలోనే సరికొత్త వాణిజ్య ఒప్పందం జరగనున్నట్లు వార్తలు వస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం.. అమెరికాకు వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఆ రాయితీలపై కోతలు విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఎలా జరగనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa