ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ.. ఆ తర్వాత పశ్చాత్తాపం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 08:37 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో నడిరోడ్డుపై చెలరేగిన ఓ చిన్న ట్రాఫిక్ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ గొడవలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. ఆటో డ్రైవర్‌ను చెప్పుతో ఇష్టం వచ్చినట్టు కొట్టడం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బెల్లందూరు ప్రాంతంలో జరిగింది. బెల్లందూరులోని గ్రీన్ గ్లెన్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న 28 ఏళ్ల పంఖురి మిశ్రా తన భర్తతో కలిసి స్కూటీపై వెళ్తోంది. అదే సమయంలో ఆటో డ్రైవర్ లోకేష్ కూడా అదే మార్గంలో వెళ్తుండగా.. తమ స్కూటీని ఆటో ఢీకొట్టిందన్నది పంఖురి మిశ్రా గొడవకు దిగింది. దీంతో.. ఆ ఆటోను నడి రోడ్డుపై ఆపేసిన పంఖురి మిశ్రా.. ఆటో డ్రైవర్‌పై బూతులతో రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్ సముదాయించినా పట్టించుకోకుండా.. ఇష్టం వచ్చినట్టు తిడుతుండటంతో ఆమె చేస్తున్న హడావుడిని లోకేష్ తన ఫోన్‌లో రికార్డు చేశాడు.


లోకేష్ తన ఫోన్‌లో ఆమె చేస్తున్న గొడవను రికార్డు చేస్తుంటే.. పంఖురి మిశ్రా ఇంకా రెచ్చిపోయింది. తనను ఎందుకు వీడియో తీస్తున్నావని ప్రశ్నించగా.. నేను తీస్తానని సమాధానం చెప్పటంతో ఇంకా ఆగ్రహానికి గురైంది. నన్నే వీడియో తీస్తావా అంటూ.. తన కాలికు ఉన్న చెప్పు తీసుకుని లోకేష్‌పై దాడి చేసింది. ఒక వైపు లోకేష్‌ను చెప్పుతో కొడుతూనే.. మరోవైపు.. పోలీసులకు ఫోన్ చేసి.. తమ వాహనాన్ని ఢీకొట్టి తమపైకే గొడవకు వచ్చాడని.. పర్మిషన్ లేకుండా వీడియో కూడా తీస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులను ఆరా తీసి.. ఎవరిది తప్పన్నది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇరువైపులా సర్ధిచెప్పి పంపించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


అయితే.. ఈ ఘటనపై లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. బెల్లందూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చెప్పుతో కొడుతూ ఆమె చేసిన హంగామా వీడియోను పోలీసులకు చూపించటంతో పాటు.. సోషల్ మీడియాలో కూడా పెట్టాడు. దీంతో.. ఈ వీడియో వైరల్ కావటంతో.. స్థానికులు తీవ్రంగా స్పందించారు. లోకల్ డ్రైవర్‌పై ఎవరో బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఉద్యోగి.. చెప్పుతో దాడి చేయటమేంటంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్ణాటకలో కన్నడ భాషకు సంబంధించి కాస్త వివాదం నడుస్తున్న వేళ.. ఈ గొడవ బయటకు రావటంతో.. కన్నడ అనుకూల కార్యకర్తలు నిరసనలు కూడా చేపట్టారు.


దీంతో.. లోకేష్ ఇచ్చిన వీడియోను, జనాలు చెప్పిన విషయాలన్ని పరిగణలోకి తీసుకున్న ప్రజలు పంఖురిపై కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పంఖురి తగ్గినట్టు తెలుస్తోంది. తాను గర్భవతినని, వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తున్నానని.. అదే సమయంలో ఆటో డ్రైవర్ కట్ కొట్టేసరికి.. కిందపడితే పరిస్థితేంటన్నది భయమేసి అంతగా రియాక్ట్ కావాల్సివచ్చిందని.. తనకు కన్నడ ప్రజలపైన ఎలాంటి ద్వేషం లేదని.. కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్తున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్‌కు కూడా క్షమాపణ చెప్పినట్టు సమాచారం. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa