టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఆయనకు చెందిన వన్8 కమ్యూన్ పబ్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. గతంలోనే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదంటూ కేసు పెట్టిన పోలీసులు.. తాజాగా ప్రత్యేక స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేయకపోవడంతో కేసు నమోదు చేశారు. ముఖ్యంగా COPTA చట్టం ప్రకారం సుమోటోగా కేసు నమోదు చేసినట్లు కబ్కన్ పార్కు పోలీసులు తెలిపారు.
బెంగళూరు ఎంజీ రోడ్డులోని విరాట్ కోహ్లీ యాజమాన్యంలోని పబ్ మరియు రెస్టారెంట్ "వన్8 కమ్యూన్" ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా నిర్ణీత ధూమపాన ప్రాంతం లేకపోవడంతో చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఇత్పత్తుల చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు కబ్కన్ పార్కు పోలీసులు రెస్టారెంట్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. పబ్ లోపల ధూమపానం కోసం ప్రత్యేక స్మోకింగ్ జోన్ లేకపోవడంతో COPTA సెక్షన్4, సెక్షన్ 21 కింద కేసులు పెట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, విమానాశ్రయాలు వంటి కొన్ని ప్రదేశాల్లో ఇలా ప్రత్యేకించి స్కోకింగ్ జోన్ల ఏర్పాటుకు ఈ చట్టం అనుమతిని ఇస్తుంది. అవి లేకపోతే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
కోహ్లీకి చెందిన ఈ పబ్బుపై కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు కారణాలతో పోలీలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పబ్ నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉండడంతో గతంలో జులైలో కేసు బుక్ చేశారు. అర్ధరాత్రి భారీగా సౌండ్లు రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇలా కోహ్లీకి చెందిన పబ్ తెరిచి ఉండగా.. కేసు పెట్టారు. గతేడాది డిసెంబర్లో కూడా ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నోటీలు జారీ చేశారు. అయితే తాజాగా కేసు నమోదు కావడం మూడోసారి.
ఇదిలా ఉండగా.. కర్ణాటక సర్కారు హుక్కా బార్లపై పూర్తి నిషేధం విధించింది. పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచింది. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే కోహ్లీ పబ్పై కేసు నమోదు అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa