ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శారీరక సుఖం కోసం యువకుడిని వేధించిన యువతి

national |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 08:53 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర్‌నగర్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో.. ఓ ఇంజినీరింగ్ ట్రైనీ తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. తన తోటి విద్యార్థిని ఒకరు తనను శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసిందని, ఆపై వేధించిందని సూసైడ్ నోట్‌లో ఆ యువకుడు పేర్కొన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం తీరుపైనా బాధితుడి తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది.


20 ఏళ్ల ఇంజినీరింగ్ ట్రైనీ.. శుక్రవారం రాత్రి తన కాలేజీ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం ఉదయం తోటి విద్యార్థులు అతడ్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఆ విద్యార్థి జేబులో దొరికిన సూసైడ్ నోట్‌లో తోటి విద్యార్థిని ఒకరు తనను వేధించి.. మానసికంగా హింసించిందని ఆరోపించాడు. ఈ కేసు దర్యాప్తులో ఉందని డీఎస్పీ సుందర్‌నగర్ భారత్ భూషణ్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించిందని.. విచారణలో భాగంగా హాస్టల్ నుంచి సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు.


మృతుడి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఆ యువతి తన కొడుకును బ్లాక్‌మెయిల్ చేసి తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని పేర్కొంది. తన కొడుకును ఆ యువతి శారీరక సంబంధానికి బలవంతం చేసిందని.. తన కొడుకు చనిపోవడానికి ముందు ఈ విషయం తనతో చెప్పినట్లు తల్లి వెల్లడించింది. అయితే గత నెల మొదట్లో తన కుమారుడికి చికెన్‌పాక్స్ వచ్చిందని.. ఆ సమయంలో కాలేజీ యాజమాన్యం స్పందించిన తీరుపైనా ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమంయలో తన కుమారుడికి చికిత్స అందించకుండా.. తన కొడుకును హాస్టల్‌ నుంచి వెళ్లిపోమన్నారని తెలిపింది. దీంతో మే 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు సుందర్‌నగర్‌లోని ప్రభుత్వ రెస్ట్ హౌస్‌లో ఉండాల్సి వచ్చిందని వివరించింది. ఇక ఆ యువకుడు ఆరోపణలు చేసిన యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెను సోమవారం వరకు రిమాండ్‌లో ఉంచనున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. బాధితుడి కుటుంబం చేసిన ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa