ఉర్సా భూముల వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్కు వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సవాల్ విసిరారు. ఉర్సా భూముల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం మొత్తం ఫైళ్లను బహిర్గతం చేయడంతో పాటు ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ అంశంపై లోకేశ్ చేసిన సవాల్కు స్పందిస్తూ గుడివాడ అమర్ నాథ్ నిన్న ప్రకటన విడుదల చేశారు. తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి లోకేశ్కు పలు ప్రశ్నలను సంధించారు.ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు విషయంపై జీవో విడుదల కాకుండానే లోకేశ్ ఎలా ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. కుంభకోణం బయటపడి దాదాపు 50 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ప్రకటన చేయడం వెనుక ఆంతర్యమేమిటని అడిగారు. దీని వెనుక నడిచిన తతంగం ఏమిటని ప్రశ్నించారు. వారు మూసేయాల్సినవి మూసేశారా.. ఫైళ్లు చింపేసినా, తగులబెట్టినా స్కిల్ స్కామ్ మాదిరిగానే బయటకు వస్తాయి కదా అని అన్నారు. లోకేశ్ 2024 అక్టోబర్ 25న అమెరికా వెళ్లడం, ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో సదరు కంపెనీ రిజిస్టర్ కావడం, ఏప్రిల్లో జరిగిన క్యాబినెట్ భేటీలో ఉర్సాకు భూముల కేటాయింపు ఆమోదం వెనుక అసలు అర్థం ఏమిటి, ఆ కంపెనీపై ఎందుకంత ప్రేమ అని నిలదీశారు.ఉర్సా చేసిన ప్రాజెక్టులు, ఆ కంపెనీ సృష్టించిన టెక్నాలజీని లోకేశ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. 5వేల కోట్ల కంపెనీ హైదరాబాద్లోని ఓ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఉందని, ఒక కుటుంబం ఎంత కరెంటు బిల్లు కడుతుందో అంతే మొత్తంలో ఈ కంపెనీ కడుతోందని, ఇలాంటి కంపెనీకి రూ.3వేల కోట్ల విలువైన భూములను అప్పగించడం ఏ రకంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఉర్సాకు ఏకంగా రూ.50 కోట్ల విలువ చేసే 60 ఎకరాల భూమిని అప్పనంగా ఇస్తున్నారని, మరి ఎవరికైనా ఇలాగే ఇస్తారా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa