ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకానికి సంబంధించి పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రెండో ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన రాయితీ డబ్బులపై క్లారిటీ ఇచ్చారు. సిలిండర్ బుక్ చేసుకున్న కొందరు లబ్ధిదారులకు రాయితీ డబ్బులు జమ కాలేదని.. కొన్ని సాంకేతిక కారణాలతోనే డబ్బులు రాలేదన్నారు. వీరందరికి త్వరలోనే సబ్సిడీ సొమ్మును బ్యాంక్ అకౌంట్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి. అలాగే మూడో విడత ఉచిత సిలిండర్కు సంబంధించిన రాయితీ డబ్బులపై కీలక ప్రకటన చేశారు. మూడో సిలిండర్ రాయితీ డబ్బుల్ని ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఎవరైనా కేవైసీ చేసుకోకపోయినా బ్యాంక్ అకౌంట్లో దీపం 2 పథకం కింద డబ్బులు జమ కావని.. వారు వెంటనే కేవైసీ పూర్తి చేసుకుంటే వెంటనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారన్నారు. అలాంటివారు వెంటనే గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. కొంతమందికి బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ కాని కారణంగా డబ్బులు జమ చేయలేదంటున్నారు.. ఇది కూడా చెక్ చేసుకోవాలి అంటున్నారు. వీటిని గమనించి సరిచేసుకుంటే రాయితీ డబ్బులు బ్యాంక్ అకౌంట్కు డబ్బులు జమ అవుతాయంటున్నారు. దీపం పథకం కింద తొలి విడతకు సంబంధించి.. ఇంకా 15 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ల రాయితీ అందించాల్సి ఉందని.. ఈ సమస్య కూడా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం షాపులకు రావాల్సిన అవసరం లేదన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డీలర్లే వారి ఇంటికి రేషన్ తెచ్చి ఇస్తారని.. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రజలు సరుకుల పంపిణీలో, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి రేషన్ షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా కంటే షాపుల ద్వారా పంపిణీ 60% ఎక్కువగా ఉందన్నారు. రేషన్ పంపిణీలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయని.. వెంటనే వాటిని సరిదిద్దామన్నారు. రేషన్ పంపిణీ 15వ తేదీ వరకు కొనసాగుతుందని..రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందని మరోసారి గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన పథకం గురించి క్లారిటీ ఇచ్చారు మంత్రి. ఈ నెల 12 నుంచి మధ్యాహ్న భోజనానికి బియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. పాఠశాలలకు నెల అవసరాలకు సరిపడా 25 కిలోల చొప్పున ప్యాకింగ్ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తామన్నారు. ధాన్యాన్ని పండించిన రైతుల చేతుల మీదుగానే బియ్యాన్ని స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేషన్ తీసుకోని కార్డుదారులకు డీబీటీ ద్వారా నగదు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa