రోజులు మారిపోయాయి.. దొంగలు రెచ్చిపోతున్నారు.. చట్టాలంటే భయం తగ్గిపోవటమో, లేకపోతే మనల్ని ఎవడ్రా ఆపేది అనే ధైర్యమో తెలియదు కానీ.. దొంగలు మరీ బరి తెగిస్తున్నారు. ఒకప్పుడు దారి కాచి చోరీ చేసే దొంగలు.. ఇప్పుడు మరీ రెచ్చిపోతున్నారు. ఏకంగా ఇళ్లల్లోకి ప్రవేశించి.. అందినకాడికి దోచుకెళ్తున్నారు. అయితే ఇంటి సభ్యులు తాళం వేసి వేరే ఊరికి వెళ్లినప్పుడో లేదా ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న సమయంలోనో.. ఇళ్లల్లోకి దూరి చోరీ చేయడం ఓకే. కానీ ఇంట్లో అందరూ ఉండగానే.. ఇంట్లోకి దూరి దొంగతనం చేశారంటే.. ఏం గుండెరా అది అనుకోక తప్పదు. ఇలాంటి ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. ఈ దొంగతనం గురించి తెలిసిన స్థానికులు.. ఇదేం విచిత్రం అని చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కదిరి పట్టణంలోని జడ్జి బంగ్లా వెనుక ఉన్న వైశ్యకాలనీలో వెంకటశివ, కవిత దంపతులు నివసిస్తున్నారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు ఉంటున్న ఇళ్లు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్.. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులు వేర్వేరుగా.. వేరే గదుల్లో పడుకున్నారు. రెండు బెడ్రూమ్లలో కుటుంబసభ్యులు పడుకోగా.. ఒక బెడ్రూమ్లో మాత్రం ఎవరూ పడుకోలేదు. ఇక అదే రూమ్లో బీరువా ఉంది. ఆ బీరువాలో నగదు, నగలు గట్రా ఉన్నాయి. ఈ విషయం ఎలా తెలిసిందో కానీ దొంగలు పసిగట్టారు. ఆదివారం రాత్రి ఆ ఇంట్లో చోరీకి ప్లాన్ చేశారు.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత బెడ్ రూమ్ కిటికీకి ఉన్న కడ్డీలు కోసి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఆ గదిలో శబ్దాలు బయటకు వినపడకుండా.. అలాగే వెంటనే ఎవరూ రాకుండా బెడ్ రూమ్ గడిపెట్టేశారు. ఆ తర్వాత బీరువాలోని 10 తులాల బంగారు నగలు, 4 కిలోల వెండి, రూ.లక్ష నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. సోమవారం తెల్లవారుజామున వెంకటశివ దంపతుల కుమార్తె.. బెడ్ రూమ్ లోపలి నుంచి గడియ వేసి ఉండటం గమనించింది. ఎవరూ లేని బెడ్రూమ్లో.. లోపలి నుంచి ఎవరు గడియ పెట్టారనే అనుమానంతో వెంటనే తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది.
దీంతో వెంకటశివ దంపతులు బెడ్రూమ్ బయటి నుంచి పరిశీలిస్తే.. అసలు విషయం బోధపడింది. బెడ్ రూమ్ కిటీకీ కడ్డీలు తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం దొంగలను గుర్తించేందుకు క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ రంగంలోకి దించారు. చోరీ జరిగిన గదిని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఇంటి యజమాని వెంకటశివ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు జరుపుతున్నారు. అయితే ఇంట్లో అందరూ నిద్రపోతుండగానే.. చోరీ జరిగిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa