ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం,,, మామిడి రైతులకు ఊర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 06:11 PM

మామిడి రైతులకు ఊరట కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో మామిడికి రూ.12 చెల్లించాలని మామిడిని కొనుగోలు చేసే కంపెనీల యాజమాన్యాలను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా మామిడి సాగవుతోంది. అయితే మామిడి పంటను కొనుగోలు చేసేందుకు కంపెనీల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. వ్యాపారులకు అమ్ముదామంటే రేటు మరీ తగ్గించి అడుగుతున్నారు. దీంతో చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోత కోయకుండా చెట్ల మీదే ఉంచితే.. మామిడి కాయలు రాలిపోతున్నాయి. కోత కోస్తే మార్కెట్ లేని పరిస్థితి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వచ్చిన ధరకే మామిడిని అమ్ముకుంటున్నారు.


మామిడికి మద్దతు ధర లేక.. పెట్టిన పెట్టుబడి కూడా రాక.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మామిడి రైతుల సమస్యలను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన చంద్రబాబు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌.. చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీ మోహన్‌, రైతు సంఘాలు, కంపెనీల యజమానులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. కిలో మామిడి రూ.12 చొప్పున కొనుగోలు చేయాలని పల్ప్ కంపెనీల యజమానులను ఆదేశించారు.


మన దేశంలో మామిడి పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, తోతాపురి, నీలం ఇలా ఎన్నో రకాల మామిడిని రైతులు సాగుచేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలో మామిడి పంటను ఎక్కువగా సాగుచేస్తుంటారు. ఏటా 43.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ నుంచి మామిడి వేరే రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు.


చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మామిడి విస్తీర్ణం, ఉత్పత్తి రెండింటిలోనూ ముందంజలో ఉంది. మరే ప్రాంతంలో లేని విధంగా చిత్తూరు జిల్లా రైతులు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. తోతాపురి మామిడి పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.


బేనీషా, నీలం, చెరకు రసాలు వంటి రకాలు కూడా సాగుచేస్తున్నారు. మామిడి పండ్ల రసం తయారు చేసే కంపెనీలు ఎక్కువగా తోతాపురి రకాన్ని కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఈసారి కిలో మామిడి రూ.5 నుంచి రూ.7 వరకూ అడుగుతూ ఉండటంతో రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మామిడి మద్దతు ధరపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa