ఏపీలోని క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. ప్రపంచకప్ మ్యాచ్లు చూసే ఛాన్స్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో రెండు మ్యాచ్లు విశాఖలో జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ రెండో స్థానంగా విశాఖపట్నం ఎంచుకోవటంతో.. ఐపీఎల్ మజా చూసే అవకాశం విశాఖవాసులకు దక్కింది. అయితే విశాఖవాసులకు ఐసీసీ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఏకంగా ప్రపంచకప్ మ్యాచ్లు లైవ్లో చూసే అవకాశం కల్పించింది. మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
2025 మహిళల వన్డే ప్రపంచకప్.. భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది.సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో మహిళల వన్డే ప్రపంచకప్కు సంబంధించిన మ్యాచ్ల వేదికలను ఐసీసీ ప్రకటించింది. భారతదేశం, శ్రీలంకల్లోని ఐదు వేదికల్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ స్డేడియంతో పాటుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, గువాహటిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్లోని హోల్కర్ స్టేడియం. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ద్వారానే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29న తొలి సెమీ ఫైనల్, అక్టోబర్ 30న రెండో సెమీ ఫైనల్ జరగనుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్ నిర్వహిస్తారు. అయితే ఫైనల్ వేదికను కూడా ఇంకా ఖరారు చేయలేదు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో విశాఖపట్నం కూడా వేదికగా ప్రకటించారు. అయితే విశాఖపట్నంలో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయనేదీ ఇంకా ఖరారు కాలేదు. దీంతో క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు విశాఖపట్నం ఏసీఏ -వీడీసీఏ స్టేడియంలో ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. గతంలో ఒకట్రెండు మహిళల మ్యాచ్లు కూడా నిర్వహించారు. అయితే ప్రపంచకప్ మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి. దీంతో ఈ ప్రాంతంలోని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa