ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ప్రాంతానికి మహర్దశ,,.ఏపీలో ఆక్వా పార్కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 06:23 PM

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇండస్ట్రియల్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులు, టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు ద్వారా పెట్టుబడులను ఆకర్షించి.. స్థానిక యువతకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బాపట్ల జిల్లాలోనూ ఆక్వా పార్కు ఏర్పాటు చేయనున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో ఆక్వాపార్కు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నిజాంపట్నంలోని దిండి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు నిర్మించనున్నారు. ఆక్వా పార్కు నిర్మాణ పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. టెండర్లు ఖరారు కాగానే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నారు.


మరోవైపు దిండి ఆక్వా పార్కు నిర్మాణం కోసం గతంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. 2020లోనే అనుమతులు కూడా మంజూరు చేసింది. దిండి సమీకృత ఆక్వా పార్కు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను కేటాయించనుంది. మిగతా 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే భూకేటాయింపులో ఆలస్యం జరగ్గా.. చివరకు 2022లో దిండి వద్ద 280 ఎకరాలు ఆక్వాపార్కు కోసం కేటాయించారు. 2023 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వర్చువల్‌గా శంకుస్థాపన కూడా చేశారు.


దిండి ఆక్వా పార్కు నిర్మాణం కోసం రెండు దశల్లో రూ.188 కోట్లు ఖర్చు చేయాలని అంచనాలు రూపొందించారు. మొదటి దశలో పీతలు, సముద్ర నాచు, రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, నీటిశుద్ధి ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా నిధులు విడుదల కాకపోవటంతో ప్రాజెక్టులో జాప్యం జరిగింది.


అయితే 2024లో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో దిండి ఆక్వా పార్కు నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. 192 ఎకరాలను ఆక్వా పార్కు కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్వా పార్కు నిర్మాణానికి నిధుల కేటాయించాలని కేంద్రాన్ని కోరగా.. మరోసారి ప్రాజెక్టు అంచనా వ్యయం రూపొందించి పంపాలని కేంద్రం జవాబిచ్చింది. అలాగే దిండి ఆక్వా పార్కు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.88.08 కోట్లకే పరిమితం చేయాలని పేర్కొంది. దీంతో రూ.88 కోట్లతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపగా.. కేంద్రం నుంచి అనుమతులు మంజూరు అయ్యాయి. దిండి ఆక్వా పార్కు నిర్మాణం కోసం కేంద్రం రూ.52.85 కోట్లు , రాష్ట్ర ప్రభుత్వం రూ.35.23 కోట్లు ఖర్చు చేయనున్నాయి.


మరోవైపు ఆక్వారంగ ప్రగతికి ఆక్వా పార్కు ప్రాజెక్టు కీలకం. రొయ్యలు, పీతల హేచరీలు ఈ ప్రాంతంలో లేకపోవటంతో రైతులు.. పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి చేప పిల్లలను తెప్పిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే ఆక్వా ఎగుమతులు పెరగడం కూడా ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా టెండర్లు ఖరారు చేసి.. పనులు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa