పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్-బాల్టిస్తాన్లో ఉన్న కారకోరం హైవేను స్థానికులు మూడో రోజు దిగ్బంధించడంతో పాక్-చైనా మధ్య వాహనాల రాకపోకలుపూర్తిగా నిలిచిపోయాయి. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ సంకీర్ణ సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేలాది మంది గిల్గిట్-బాల్టిస్తాన్ నివాసితులువీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారకోరం హైవే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)లో కీలకమైన మార్గం కావడం గమనార్హం.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ఎన్ సహా పలు రాజకీయ పార్టీల మద్దతుతో నడుస్తున్న పాక్ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా గిల్గిట్-బాల్టిస్తాన్కు చెందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాక్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను వారు దోపిడీ, ఆర్థిక హత్యగా అభివర్ణిస్తున్నారు. హుంజా, గిల్గిట్, ఇతర సమీప పట్టణాల వ్యాపారులు, ప్రజలు కూడా నిరసనకారులకు మద్దతుగా ఆందోళనకుదిగారు.
గిల్గిట్-బాల్టిస్తాన్లోని గుల్మత్ నగర్లో నిర్వహించిన ధర్నాలో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ మీడియా వెల్లడించిన ప్రకారం.. తమ డిమాండ్లు నెరవేరే వరకు చైనా-పాక్ హైవేను దిగ్బంధిస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే పీఎంఎల్ఎన్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు జావేద్ హుస్సేన్ మాట్లాడుతూ.. తన సొంత పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. నిరసనకారుల డిమాండ్లను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో లేదని అంగీకరించారు. గిల్గిట్-బాల్టిస్తాన్ అసెంబ్లీ మాజీ సభ్యుడైన హుస్సేన్.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం వివక్షను ఎదుర్కొంటుందని ఆరోపించారు.
గిల్గిట్-బాల్టిస్తాన్ దిగుమతిదారులు, ఎగుమతిదారుల సంఘం.. నగర చాంబర్ ఆఫ్ కామర్స్.. నగర్, హుంజా, గిల్గిట్ల నుంచి చిన్న వాణిజ్య సంఘాలతో కూడిన పాక్-చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. గత 6 నెలలుగా మూసివేసినన సోస్ట్ డ్రై పోర్ట్లో చైనా నుండి దిగుమతి చేసుకున్న సరుకులకు కస్టమ్స్ క్లియరెన్స్ నిలిపివేయడమే పీఓకేలో ఈ నిరసనలు వెల్లువెత్తడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వ్యాపారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్ నుంచి కనీసం 257 సరుకులు సోస్ట్ డ్రై పోర్ట్లో నిలిచిపోయాయని సమాచారం. దీనివల్ల కాలం చెల్లిన వస్తువులు, రోజువారీ పోర్ట్ ఛార్జీలు, ఇతర ఖర్చుల కారణంగా భారీ ఆర్థిక నష్టాలు సంభవించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం పీఓకేలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు పలు డిమాండ్లు చేస్తున్నారు. పోర్టులో నిలిచిపోయిన సరుకులను వన్-టైమ్ అమ్నెస్టీ పథకం ద్వారా తక్షణమే క్లియర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నష్టాలను ఇక తాము భరించలేమని వారు తేల్చి చెప్పేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa