ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ బిల్లుపై ఓటేసినవారికి సిగ్గుండాలి.. ట్రంప్ పై మస్క్ తీవ్ర విమర్శలు

international |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 11:33 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య చెడిందనే వార్తలు గుప్పమంటున్నాయి. ఈ క్రమంలో ఓ బిల్లు విషయమై ట్రంప్‌పై మస్క్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ ప్రతిపాదించిన ఖర్చు బిల్లును ‘అసహ్యకరమైన ఘోరమైన చర్య’గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల వైట్ హౌస్ నుంచి మస్క్ నిష్క్రమించిన తరువాత, ఈ ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు తాజాగా బయటపడ్డాయి. మస్క్ గత వారం డోజ్ చీఫ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వృథా ఖర్చులను నివారించి, పాలనలో పారదర్శకత కోసం డోజ్‌ను ట్రంప్ ఏర్పాటుచేశారు. ధీనికి నాయకత్వం వహించిన మస్క్.. ఖర్చులను నివారించడాన్ని ట్రంప్ ప్రశంసించారు. కానీ అప్పటికే ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.


‘ఈ భారీ, దారుణమైన, అర్థరహిత ఖర్చులతో నిండిన కాంగ్రెస్ బిల్లు ఒక అసహ్యకరమైన ఘోరమైన చర్య. ఇది మానవాళిపై భారంగా మారుతుంది.. దీనికి ఓటేసిన వారందరికీ సిగ్గుపడాలి. మీరు తప్పు చేశారన్న విషయం మీకే తెలుసు’ అని మస్క్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ట్రంప్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. ఈ బిల్లు వచ్చే 10 ఏళ్లలో అమెరికా రుణాలను 3 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని అంచనా. ఇది ఆరోగ్య, ఆహార సహాయం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు భారీగా కోతలు పెట్టే ప్రయత్నంగా భావిస్తున్నప్పటికీ.. వాస్తవానికి ఖర్చు పెరుగుతాయి. డోజ్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఈ బిల్లు తన ఖర్చు తగ్గింపు యత్నాలను దెబ్బతీసిందని మాత్రమే మస్క్ పేర్కొన్నారు. ఈసారి మాత్రం మస్క్ కఠినంగా స్పందించారు:‘‘ ఈ బిల్లు అమెరికన్ పౌరులపై అసాధ్యమైన రుణభారాన్ని మోపుతుంది’’ అని ఆరోపించారు.


వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మస్క్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం అధ్యక్షుడికి ముందే తెలుసు. కానీ అది ఆయన అభిప్రాయాన్ని మార్చదు. ఇది ఒక బిగ్, బ్యూటిఫుల్ బిల్లు. అధ్యక్షుడు దానిని కొనసాగిస్తారు’ అని అన్నారు. ఎన్నికలకు ముందు నుంచి కలిసిమెలిసి తిరిగే మస్క్, ట్రంప్ ఇప్పుడు పరస్పర విమర్శలకు దిగిన దశకు వచ్చారు. మస్క్ ఎయిర్‌‌ఫోర్స్ ఒన్, మెరైన్ ఒన్, మార్ ఎ లాగో వంటి ప్రదేశాల్లో ట్రంప్‌తో కలిసి కనిపించేవారు. కానీ ఇప్పుడు వారి బంధం బలహీనమైంది.


మస్క్ నాయకత్వంలోని డోజ్ మంత్రిత్వశాఖ నాలుగు నెలల కాలంలో వేలాది ఉద్యోగాలను తొలగించి, విదేశీ సహాయాన్ని కట్ చేసింది. మస్క్ 2 ట్రిలియన్ డాలర్లు ఆదా చేయాలనే లక్ష్యంతో డోజ్‌ను ప్రారంభించారు. కానీ, 175 బిలియన్ డాలర్లు ఆదా చేసినట్టు డోజ్ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఇటీవల టెస్లా అమ్మకాలు తగ్గడం, స్పేస్‌ఎక్స్ రాకెట్ల వైఫల్యాలు, కంపెనీలపై నిరసనలతో మస్క్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన డోజ్ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో మస్క్, ట్రంప్ మధ్య బంధం పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. ఒక్కప్పుడు స్నేహితులుగా ఉన్న ఇద్దరు బిలియనీర్లు ఇప్పుడు ప్రజాస్వామ్య, ఆర్థిక విధానాలపై విభేదిస్తూ తలపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa