ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి ఫోన్ చేసి మరీ సారీ చెప్పిన మస్క్

international |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 08:19 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య గొడవకు తెర పడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మస్కే తన తప్పు తెలుసుకున్నట్లు బుధవారం రోజు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ట్రంప్‌తో జరిగిన గొడవ పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. అయితే అందుకు ఒక రోజు ముందే మస్క్.. ట్రంప్‌నకు ప్రైవేట్ ఫోన్ కాల్ చేసి మరీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ సారీని ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేశారని తాజాగా శ్వేతసౌధం తెలిపింది. ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించగా.. ట్రంప్, మస్క్‌ల స్నేహబంధం మళ్లీ చిగురించినట్లేనని అంతా భావిస్తున్నారు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధినేత మస్క్ వ్యతిరేకించడంతో గొడవ మొదలైంది. ముఖ్యంగా మస్క్, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈక్రమంలోనే మస్క్ ఎక్స్ వేదికగా ట్రంప్ గురించి వరుస పోస్టులు పెట్టారు. ఆయనకు సెక్స్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని, తాను లేకపోతే 2024 ఎన్నికల్లో గెలిచే వారే కాదంటూ వివరించారు. మరోవైపు ట్రంప్ కూడా వీటిపై స్పందించారు. డోజ్ నుంచి తొలగించడంతోనే తనపై కోపం పెంచుకున్న మస్క్ ఇలా ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. కానీ వీటన్నిటిపై స్పందించడానికి తన దగ్గర సమయం లేదంటూ.. మస్క్ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదన్నారు.


ఆ తర్వాతనే మస్క్ సెక్స్ కుంభంకోణంతో అమెరికా అధ్యక్షుడికి సంబంధాలు ఉన్నాయని చేసిన పోస్టును తొలగించారు. బుధవారం రోజు ట్రంప్‌పై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు చెప్పారు. ఈ పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ పశ్చాత్తాప తెలిపారు. అయితే ఇదంతా జరగడానికి ఒక రోజు ముందే.. అంటే సోమవారం రోజు అర్ధరాత్రే మస్క్ ట్రంప్‌నకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను చేసిన ఆరోపణలు తనను చాలా బాదించాయని చెప్పి క్షమాపణలు అడిగారట. అందుకు ట్రంప్‌ కూడా సానుకూలంగానే స్పందించి.. సారీని అంగీకరించినట్లు వివరించారట. అయితే ఈ విషయాన్ని నేరుగా శ్వేతసౌధమే తెలిపింది.


ముఖ్యంగా ఈ పరిణామాలపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ స్పందించారు. ఎలాన్ మస్క్ క్షమాపణ ప్రకటనను ట్రంప్ అంగీకరించారని వెల్లడించారు. అలాగే దీన్ని అమెరికా అధ్యక్షుడు అబినందించారని.. తమ దేశ ప్రజన ప్రయోజనాలపై దృష్టి కొనసాగుతుందని చెప్పారు. ఇక ట్రంప్ చెప్పినట్లుగా మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా అని మీడియా ప్రశ్నించగా.. కరోలిన్ లివిట్ అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గత శుక్రవారం రోజే మస్క్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూసీ విల్స్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఇరువురు నేతలు.. ట్రంప్ తో విభేదాలు పరిష్కరించుకోవాలని మస్క్‌కు సూచించగా.. ఆయన అదే పని చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa