అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కలిచివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం 1.38గంటల సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కేవలం ఒక్క వ్యక్తి మినహా 241 మంది మృతిచెందారు. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడటంతో వారిలో 24మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. అయితే, విమాన ప్రమాదానికి ప్రధానంగా రెండు కారణాలు అయ్యి ఉంటాయని తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు.. దానికితోడు రెక్కల వెనుక భాగం (ఫ్లాప్) ముడుచుకుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు, ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానికి ప్రాణాంతకమేనని నిపుణులు పేర్కొంటున్నారు. విమానం టేకాఫైన వెంటనే సాధారణంగా 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా, ఆ వెంటనే తిరిగి బయటికి వచ్చింది. బహుశా విమానానికి కావాల్సిన వేగం లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ చోటు చేసుకోవడమో జరిగి ఉండాలని, అది గమనించి పైలట్ ముందుజాగ్రత్తగా లాండింగ్ గేర్ ను తెరిచి ఉంటాడని వైమానిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానం పడిపోతున్న సమయంలో విమానాన్ని వెంటనే పైకి లేపేందుకు కావాల్సి వేగం కోసం ఫ్లాప్స్ ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాక.. పక్షులు ఇంజన్ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చునని పేర్కొంటున్నారు. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తి కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట వేగం అందుకోలేక పోయి ఉంటుందని వైమానిక నిపుణులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa