ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహ్మదాబాద్ విమాన ప్రమాదం టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా

sports |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 07:52 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ పేరిట నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక 'టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ' ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వాస్తవానికి నేడు  లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఈ ఓపెనింగ్ సెర్మనీతో టెస్టు సిరీస్ కు ఘనంగా శ్రీకారం చుట్టాలని భావించారు. అయితే, భారత్ లో విమాన ప్రమాదం తీవ్ర విషాదం కలిగించడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి.ఇదివరకూ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ విజేతలకు 'పటౌడీ ట్రోఫీ'ని అందజేసేవారు. అయితే, ఇటీవలే ఆ ట్రోఫీ పేరును మార్పు చేస్తూ, క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేసిన సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్‌ల గౌరవార్థం వారి పేర్లతో కొత్త ట్రోఫీని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.ప్రస్తుతం వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది అనే దానిపై బీసీసీఐ, ఈసీబీ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే కొత్త తేదీని ఖరారు చేసి, వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఇరు బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa