ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు ఇజ్రాయెల్ క్షమాపణ

international |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 08:31 PM

ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే శుక్రవారం రోజు ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడగా.. ఇరాన్ సైతం గట్టిగానే సమాధానం చెప్పింది. ఈక్రమంలోనే ఇజ్రాయెల్.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఇరాన్ ప్రపంచ దేశాలకే ముప్పు అని చెబుతూ ఆయా దేశాల పటాలను విడుదల చేసింది. అందులో ఇండియా పటంలో జమ్మూ కాశ్మీర్ లేదు. ముఖ్యంగా పాక్ భూభాగంలో జమ్మూ కాశ్మీర్ దర్శనం ఇచ్చింది. దీంతో భారతీయులు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ లేకుండా ఇండియా ఉండదని తేల్చి చెప్పారు. దీంతో తన తప్పును గుర్తించిన ఇజ్రాయెల్ భారత దేశానికి క్షమాపణలు చెప్పింది. ఎక్స్ వేదికగానే తన తప్పును ఒప్పుకున్నట్లు వివరించింది.


ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) షేర్ చేసిన పటంలో భారతదేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే విధంగా కొన్ని లోపాలు కనిపించాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను మ్యాప్‌లో కనిపించలేదు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌ను కూడా తప్పుగా వర్ణించింది. ఇది మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ పాకిస్థాన్ భూభాగంలో దర్శనం ఇచ్చింది. దీంతో భారతీయ నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఈ పోస్టును డిలీట్ చేయాలంటూ భారతీయ నెటిజెన్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్యాగ్ చేస్తూ ఇందుకు సంబంధించి పోస్టులు పెట్టారు. ముఖ్యంగా దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన సున్నితమైన విషయాలలో ఇలాంటి పొరపాట్లు అంగీకరించలేమని చెప్పారు.


అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి చిత్రాలను ప్రచురించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ అధికారులకు సూచించారు. అయితే తాజాగా దీనిపై ఐడీఎఫ్ స్పందించింది. అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదరహించడం కోసం చేసిన పోస్టు మాత్రమేనని వెల్లడించింది. అయితే అందులో ఉపయోగించిన మ్యాప్ ఫొటో.. దేశాల సరిహద్దును కచ్చితంగా చూపించడంలో విఫలం అయిందంటూ తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పిదానికి మేము క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.


ఇరాన్‌తో భీకర ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్ ఇలా భారత దేశానికి క్షమాపణలు చెప్పడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ అణు సౌకర్యాలు, సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని "రైజింగ్ లయన్" అనే పేరుతో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్, ఇతర ఇజ్రాయెల్ నగరాలపైకి ప్రయోగించింది. ఈ దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో.. IDF పోస్ట్ చేసిన తప్పుడు పటం అనవసరమైన వివాదానికి కారణమైంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa