తమిళనాడులో జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శన గల్లీ క్రికెట్ను తలపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఇదెక్కడి ఫీల్డింగ్ రా మావా.. అని కామెంట్లు చేస్తున్నారు. మీ కంటే మేమే బెటర్ కదా బ్రో అని పేర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే..
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా దిండిగల్ డ్రాగన్స్, మధురై పాంథర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముధురై పాంథర్స్ ఫస్టు బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాంథర్స్ బ్యాటర్ కవర్ ఫీల్డర్ వైపు షాట్ కొట్టాడు. పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్.. నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో విసిరాడు.
అశ్విన్ విసిరిన బంతి వికెట్లను తాకలేదు. బ్యాకప్ ఫీల్డర్ కూడా ఎవరూ లేకపోవడంతో బంతి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత బ్యాటర్లు మరో పరుగు కోసం పరుగెత్తారు. ఈ సమయంలో ఫీల్డర్ విసిరిన బంతిని వికెట్ కీపర్ అందుకోలేకపోయాడు. దీంతో మళ్లీ బంతి దూరంగా వెళ్లింది. ఆ తర్వాత బ్యాటర్లు మరో పరుగు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పాయింట్ నుంచి బంతి విసిరినప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఎవరూ లేకపోవడంతో బంతి మళ్లీ మిడాన్ వైపు వెళ్లింది. త్రో వేస్తే లాభం లేదనుకున్నాడో ఏమో గానీ.. మిడాన్ ఫీల్డర్ బంతిని విసరకుండా చేతితో పట్టుకుని వికెట్ల వైపు వచ్చాడు. ఫీల్డర్లు రనౌట్ మిస్ చేయడం పట్ల కెప్టెన్ అశ్విన్ ఆగ్రహానికి గురయ్యాడు.
మొత్తంగా ఒక్క పరుగు కూడా రాని పరిస్థితుల్లో దిండిగల్ డ్రాగన్స్ ఫీల్డర్ల పుణ్యమా అని.. ముధురై పాంథర్స్కు మూడు రన్స్ వచ్చాయి. అయితే ఈ మూడు సందర్భాల్లోనూ బంతి వికెట్లను తాకితే రనౌట్ అయ్యేదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్టు బ్యాటింగ్ చేసిన మధురై పాంథర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్ రవిచంద్రన్ అశ్విన్ 29 బంతుల్లో 49 రన్స్ చేయడంతో దిండిగల్ డ్రాగన్స్ కేవలం 12.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa