ప్రస్తుత రోజులలో ప్రతిదీ ఆన్లైన్గా మారిపోయింది. బస్సులో సీటు దగ్గర నుంచి గుడిలో దేవుడి దర్శనం వరకూ ప్రతిదీ డిజిటల్ రూపు సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రభుత్వం సాంకేతిక పాలనకు పెద్దపీట వేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ అంటూ అన్ని సేవలను వాట్సాప్లోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటుగా కేంద్రం అందించే పథకాల లబ్ధి చేకూరాలన్నా ఆన్లైన్ దరఖాస్తు తప్పనిసరి. ఇక అసంఘటిత రంగ కార్మికులు అయితే ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్లో నమోదు చేయాల్సిందే. అలాగే వ్యాపారస్తులకు లైసెన్సు తీసుకోవాలన్నా, సగటు మధ్యతరగతి జీవి రేషన్ కార్డు కోసం అప్లై చేయాలన్నా.. డిజిటల్ సేవలు కావాల్సిందే.
ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు డిజిటల్ సేవలను ఇంటి వద్దకే తెచ్చేందుకు ప్రభుత్వం డిజి లక్ష్మి పేరుతో కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. 10 వేల కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేస్తు్న్నారు. ఈ కియోస్క్ సెంటర్లను స్వయం సహాయక సంఘాల సభ్యులు నిర్వహించనున్నారు. ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా తొలుత 20 వరకూ సేవలు అందించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మరిన్ని సేవలు అందించనున్నారు.
ఈ కియోస్క్ సెంటర్ల ఏర్పాటుతో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఏదైనా ఆన్లైన్ అవసరం పడితే.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నిర్దేశించిన రుసుం చెల్లించి.. ప్రజలు ఈ కియోస్క్ సెంటర్ల ద్వారానే సేవలు పొందవచ్చు. అలాగే పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న డిగ్రీ చదివిన వారికి వీటిని అప్పగిస్తారు. దీంతో పేదలకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధా ఉండదు.. డ్వాక్రా మహిళలకు ఉపాధి కూడా లభించనుంది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఈ డిజి లక్ష్మి కార్యక్రమాన్ని రూపొందించింది. 300 కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ అందుబాటులోకి తెస్తారు. ఇందులో కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, ఇతర పరికరాలు డిజి లక్ష్మి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వారికి బ్యాంక్ నుంచి రూ.2 లక్షల వరకూ రుణం కూడా అందిస్తారు. ఇలాంటి కియోస్క్ సెంటర్లను రాష్ట్రంలో 10 వేల వరకూ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, విశాఖపట్నం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో వీటిని తొలుత ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. తొలి దశలో నాలుగు వేలు.. ఆ తర్వాత క్రమంగా విస్తరించనున్నారు.
ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా తాగునీటి రుసుముల చెల్లింపు, ఆస్తిపన్ను చెల్లింపులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణ వాయిదాలు, కరెంట్ బిల్లులు వంటివి చెల్లించవచ్చు. అలాగే రైలు, బస్సు టికెట్ రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులు వంటి సేవలు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa