ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

Crime |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 08:10 PM

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ.. ఆగంతకుడు బెదిరించాడు. మెయిల్ ద్వారా ఈ సమాచారం పంపించాడు. ఈ మెయిల్ చూసిన వెంటనే తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాశ్రయ ఉద్యోగులు, సిబ్బందిని బయటకు తరలించారు. బాంబు ఉందని మెయిల్ రావడంతో.. స్నిప్పర్ డాగ్స్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి.


డాగ్స్, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ నిపుణులు.. విమానాశ్రయంలోని అణువణువు గాలించాయి. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్ అథారిటీ.. అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించింది. విమానాశ్రయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత.. అధికారులు బాంబు లేదని తేల్చారు. దీనిపై సైబర్ క్రైం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాంబు ఉందంటూ మెయిల్ పంపిన వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


  అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కలాంటేనే భయపడుతున్నారు. ఇక విమానాల్లో ఎంత చిన్న సమస్య తలెత్తినా.. వెంటనే వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు. అంతేకాక అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత.. బోయింగ్ సంస్థకు చెందిన787-8 డ్రీమ్‌లైనర్ ఫ్లైట్స్ భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు అంతర్జాతీయ డ్రీమ్‌లైనర్ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


అలానే విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కూడా డ్రీమ్ లైనర్ విమానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. 2 రోజుల క్రితం హాంగ్‌కాంగ్ నుంచి ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన ఒక డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి.. తిరిగి హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు


ఆ తర్వాత శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్తోన్న మరో ఎయిరిండియా విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయంలో షెడ్యూల్ హాల్ట్ సమయంలో.. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. వెంటనే విమాన సిబ్బంది దీని గురించి ప్రయాణికులను అలర్ట్ చేశారు. వారిని విమానం నుంచి దించేశారు.


వారం రోజుల క్రితం అనగా.. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ దుర్ఘటన తర్వాత డ్రీమ్‌లైనర్ విమానాలకు సంబంధించి వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం, విమానాలు రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa