మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఇప్పటికే కీలక నేతలను కోల్పోయిన ఆ పార్టీ.. ఇప్పుడు మరో ముగ్గురు ముఖ్యమైన సభ్యులను పోగొట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూరు పరిసర అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ వీఆర్ చైతన్యతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ ఏసీఎం అంజు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనాస్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్యే ఈ అరుణ. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో అరుణ నిందితురాలిగా ఉన్నారు. 2018లో డుంబ్రిగుడ సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపారు. ఈ హత్యల్లో అరుణ పాల్గొన్నారని అప్పట్లో పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa