ఆనందోత్సాహాలతో సాగిన పెళ్లి వేడుకనే వారి జీవితంలో చివరి ఘట్టం అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, బంధుమిత్రులు, స్నేహితులతో సరాదాగా గడిన వారంతా ఇంటికి బయలుదేరారు. కానీ మార్గ మధ్యంలోనో తాము వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురి కావడంతో.. మొత్తంగా 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది ఒకేసారి చనిపోవడంతో పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో తీవ్ర విషాదం అలుముకుంది. జాతీయ రహదారి-18 రక్తమోడగా.. బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది.
బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్షోల్ సమీపంలో జాతీయ రహదారి 18పై ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. పెళ్లి వేడుక ముగించుకుని బొలెరో ఎస్యూవీలో తిరిగి వస్తున్న ఆ బృందం, వేగంగా వస్తున్న ఓ ట్రక్కును ఎదురుగా ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి బొలెరో నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో వృద్ధులు, యువకులు ఉన్నట్లు తెలుస్తోంది.
నిమిషాల వ్యవధిలోనే ఆనందం విషాదంగా మారడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర రోదనలు మిన్నంటాయి. కళ్ల ముందు జరగాల్సిన శుభకార్యం ముగిసిందని సంతోషించే లోపే.. వారి ఆత్మీయులు విగత జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన జరిగిన తీరు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు అతివేగమే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కూడా చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. రహదారి భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందడం, పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa