ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 నెలల కిందట మరణించిన డాక్టర్‌కు ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్.. అర్జెంట్‌గా జాయిన్ అవ్వాలని ఆదేశం

national |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 08:06 PM

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బిర్కెరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి డాక్టర్ స్మృతి రంజన్ సమల్.. రెండు నెలల క్రితమే మరణించినప్పటికీ ఆయనకు పదోన్నతి లభించడమే కాకుండా, కొత్త పోస్టింగ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వింత పొరపాటు అధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.


46 ఏళ్ల డాక్టర్ స్మృతి రంజన్ సమల్ రూర్కెలాకు చెందినవారు. గత మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. దురదృష్టవశాత్తు 2025 ఏప్రిల్ 6వ తేదీన ఆయన ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ సమల్ మరణించిన విషయాన్ని అవుట్‌ గోయింగ్ ఇన్‌ఛార్జ్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురు ప్రసాద్ మహంత ఆరోగ్య శాఖకు తెలియజేశామని తెలిపారు. అయినప్పటికీ.. ఆ సమాచారాన్ని ఆరోగ్య శాఖ పట్టించుకోలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ముఖ్యంగా జూన్ 20వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ ఒక ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వులో పెద్ద సంఖ్యలో డాక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ.. వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఆ జాబితాలో డాక్టర్ స్మృతి రంజన్ సమల్ పేరు కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనను అదనపు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (టీబీ)గా పదోన్నతి కల్పించి, సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.


వెంటనే కొత్త పోస్టింగుల్లో చేరాలి..!


ప్రస్తుతం కలరా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థ సజావుగా పనిచేయడానికి.. వైద్య అధికారులు వెంటనే తమ కొత్త పోస్టింగ్‌లలో చేరాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. "ప్రత్యామ్నాయం కోసం వేచి చూడకుండా, సంబంధిత అధికారులు తమ పరిపాలనా నియంత్రణలో ఉన్న వైద్య అధికారులను వారి కొత్త పోస్టింగ్ స్థలాల్లో చేరేలా చూడాలని కోరారు." అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.


మరణించిన డాక్టర్‌కు పదోన్నతి, బదిలీ ఉత్తర్వులు జారీ కావడంపై అధికారులు చర్చించుకుంటున్నారు. ఇది కేవలం మానవ తప్పిదమా లేక డేటా నిర్వహణలో లోపమా అనే కోణంలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపాన్ని, డేటా అప్‌డేట్ లేమిని స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన తెలియజేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa